పిండి దీపం వెలిగించడం మంచిదేనా… పిండి దీపం వెలిగించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి?

మన హిందూ సంప్రదాయంలో ప్రతిరోజు దేవుడి ముందు దీపం వెలిగించడం వల్ల దేవుడి ఆశీస్సులు పొంది ఇంట్లో సుఖసంతోషాలు చేకూరుతాయి. ఇలా మనం ఏ శుభకార్యం చేపట్టిన ముందుగా దీపారాధన చేసిన తర్వాత ఇతర కార్యక్రమాలను పూర్తి చేస్తారు.అయితే చాలాసార్లు మనం దేవాలయాలకు వెళ్ళినప్పుడు చాలా మంది పిండితో తయారు చేసిన దీపాలను వెలిగిస్తారు ఇలా పిండితో చేసిన దీపాలను వెలిగించడం మంచిదేనా… ఇలాంటి దీపాలను వెలిగించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనే విషయానికి వస్తే…

దీపాన్ని వెలిగించడానికి మట్టి ప్రమిదలు, వెండి దీపాలు, ఇత్తడితో చేసిన దీపాలను ఎక్కువగా ఉపయోగిస్తారు. అంతేకాకుండా కొన్ని సందర్భాలలో పిండితో తయారుచేసిన దీపాలను కూడా ఉపయోగిస్తారు. అయితే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం పిండిదీపం చాలా శక్తివంతమైనది. దేవుడి ముందు పిండి దీపం వెలిగించి పూజించటం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి. ఇలా పిండి దీపాలను వెలిగించడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం పొంది ధనవంతులుగా మారుతారు.

11 రోజులపాటు లక్ష్మీదేవి ముందు పెరుగుతున్న లేదా తగ్గుతున్న క్రమంలో పిండి దీపాలను వెలిగించడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అలాగే పిండిలో పసుపు కలిపి దీపాలను చేసి ఆవు నెయ్యితో దీపం వెలిగించి దేవుని ప్రార్థించడం వల్ల విష్ణువు కటాక్షం కూడా లభిస్తుంది. అలాగే వ్యాపారంలో తరచూ నష్టాలు వస్తుంటే శని దేవుడి ముందు 11 రోజులపాటు పిండితో తయారుచేసిన దీపాలను వెలిగించడం వల్ల నష్టాలనుండి విముక్తి లభిస్తుంది.