విజయవాడ ‘రాయలసీమ సత్యాగ్రహం’ విజయవంతం 

(యనమల నాగి రెడ్డి )

నవ్యాంధ్ర రాజధాని ముంగిట రాయలసీమ వాసులు పెట్టిన పొలికేక దేశ రాజధాని వరకు వినిపించింది. మంచి నీటి కొరతతో గొంతులెండిన సీమ ప్రజానీకం తమ ప్రాంతానికి “తాగు నీరు, సాగు నీరు చట్టబద్ధంగా అందించాలని” కోస్తా ప్రాంత నాయకుల చెవులు చిల్లులు పడేలా గర్జించారు. కోస్తా ఆంధ్ర రాయలసీమ నాయకుల మధ్య కుదిరిన “శ్రీభాగ్” ఒప్పందం వెంటనే అమలు చేయాలని, తమ ప్రాంతానికి జరిగిన అన్యాయాన్నిఆ ఒప్పందం ప్రాతిపదికగా వెంటనే సరిదిద్దాలని రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయవేదిక ఆధ్వర్యంలో సీమ రైతులు చేపట్టిన ఒక్క రోజు “శ్రీభాగ్ సత్యాగ్రహం” విజయవంతమైంది. వేలాదిమంది రైతులు విజయవాడ పురవీధులలో గళమెత్తి కదం తొక్కారు. విజయవాడ ధర్నా చౌక్ లో  నాయకులు రాయలసీమ వాణిని వినిపించారు.

విజయవాాాడ రాయలసీమ సత్యాగ్రహానికి హాజరయిన రాయలసీమ సంఘాల నేతలు, ప్రజలు

రాయల సీమలోని ఒకటిన్నర కోటి ప్రజానీకానికి, అక్కడున్న పశుసంపదకు గొంతు తడపడానికి “తాగు నీరు” సీమలో నెర్రలు చీలిన బీడు భూముల దాహార్తి తీర్చాదానికి ఒక్క ఆరు తడి పంటకు సాగు నీరు అందించాలని రాయలసీమ ప్రజాసంఘాల సమన్వయ వేదిక కన్వీనర్ బొజ్జా దశరధ రామి రెడ్డి డిమాండ్ చేశారు.

హైడ్రోఎలెక్ట్రిక్ ప్రాజెక్ట్ గా  ఉన్న శ్రీశైలం ప్రాజెక్ట్ ను మల్టి పర్పస్ ప్రాజెక్ట్ గా మార్చి రాయలసీమ ప్రాంతానికే ఆ నీటిని కేటాయించాలని  ఆయన డిమాండ్ చేస్తున్నారు.

రాయలసీమ కరువు చూపించి  ‘బచావత్ ట్రిబ్యునల్’ వద్ద “మిగులు జలాలు వాడుకునే” హక్కు సాధించిన ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం ఆ తర్వాత కాలంలో రాయలసీమ గొంతు నులిమి ఆ నీటిని కూడా కోస్తా ప్రాంతానికి తరలించారు. శ్రీభాగ్ ఒడంబడికను గురించి పాలకులు, రాజకీయ పార్టీలు ఏ మాత్రం పట్టించుకోకుండా  సీమ ఆశలకు సమాధి కట్టారని, ఇప్పటికైనా నాయకులు, పార్టీలు చిట్టా శుద్ధితో వ్యవహరించక పొతే ఈ ప్రాంతాన్ని” రాయలసీమ ఎడారిగా” దేశ పటంలో గుర్తించాల్సి వస్తుందని నాయకులు పేర్కొన్నారు.

వేదిక మీద రాయలసీమ నేతలు

సాగు భూమి

రాయలసీమలో మొత్తం 90 లక్షల ఎకరాలు సాగు యోగ్యమైన భూమి ఉండగా, మిగిలిన 9 జిల్లాలలో కోటీ 25 లక్షల ఎకరాల సాగు యోగ్యమైన భూమి ఉంది. ఇందులో రాయలసీమ ప్రాంతంలో 21. 23 లక్షల ఎకరాలకు సాగు నీటి వసతి చూపించి కేవలం 7. 94 లక్షల ఎకరాలకు మాత్రమే నీరు అందిస్తున్నారు. అదే సమయంలో ఆంధ్ర రాష్ట్రంలోని కోట 25 లక్షల సాగు యోగ్య భూమిలో 75. 60 లక్షల ఎకరాలకు సాగు నీటి వసతి చూపించి, 57.10 లక్షల ఎకరాలకు నీటి వసతి కల్పిస్తున్నారు

.

నీటి ప్రాజెక్ట్ లు            

రాష్ట్ర విభజన చట్టం మేరకు అప్పటికి నిర్మాణంలో ఉన్న అన్ని నీటి ప్రాజెక్ట్ లను పూర్తి చేస్తామని, వాటికి చట్టబద్ధ నీటి హక్కులను కల్పిస్తామని కేంద్రం ప్రకటించింది. ఐతే ఇప్పటి వరకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు  ఈ ప్రాజెక్ట్ లను పూర్తి చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అప్పటికే నిర్మాణంలో ఉన్న తెలుగు గంగ, హంద్రీ-నీవా, గాలేరు-నగిరి, వెలిగొండ, నెట్టంపాడు, కల్వకుర్తి ప్రాజెక్ట్ లు ఎక్కడ వేసిన గొంగళి చందంగానే ఉన్నాయి.

తెలంగాణా, ఆంధ్ర రాష్ట్రాల మధ్య నీటి పంపకం కోసం కేంద్ర ప్రభుత్వం  ఏర్పాటు చేసిన “బ్రిజేష్ మిశ్రా ట్రిబ్యునల్ “కు ఇచ్చిన టర్మ్స్ అఫ్ రెఫరెన్సు మేరకు రాయలసీమలోని ప్రాజెక్టులకు నీటి వసతి కల్పించాలంటే ఈ ప్రాజెక్ట్ లను విభజన చట్టంలోని సెక్షన్ 85లో షెడ్యూల్ 11ను సెక్షన్ 89లో కలుపుతూ విభజన చట్టానికి సవరణ చేస్తేనే ఈ ప్రాజెక్ట్ లకు నీటి కేటాయింపులు చేయడానికి ట్రిబ్యునల్ కు అధికారం దఖలు పడుతుందని దశరధ రామిరెడ్డి వివరించారు.

“పట్టిసీమను” సంవత్సర కాలంలోనే పూర్తి చేసి తన సత్తాను చాటుకున్న ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్ట్ లపై ఎందుకు చిన్న చూపు పెట్టిందో అర్థం కావడం లేదని  ఆయన వాపోయారు.

గాలేరు- నగిరి మొదటి దశ పూర్తి కాలేదని, హంద్రీ -నీవా లో ఇష్టారాజ్యం గా కాలువలు త్రవ్వడానికి అనుమతులు ఇస్తున్నారని,  ఆయన ఆరోపిస్తున్నారు. అలాగే ఎస్ .ఆర్.బి.సి. కాలువ వెడల్పు చేయకుండా, అవుకు నుండి నీటిని గండికోటకు- అక్కడినుండి పైడిపాలెం ద్వారా పులివెందులకు నీళ్లిచ్చి రాయలసీమను సస్యశ్యామలం చేశామని ప్రభుత్వం ప్రకటించండం దారుణమన్నారు. కుప్పం, పులివెందుల నియోజకవర్గాలకు మాత్రమే నీళ్లిచ్చి అభివృద్ధి చేస్తే రాయలసీమ మొత్తం అభివృద్ధి చెందదన్న  వాస్తవాన్ని ముఖ్యమంత్రి గుర్తించాలని వక్తలు కోరారు.

 

దుమ్మగూడెం – సాగర్ టైల్ పాండ్

గోదావరి నుండి 165 టీఎంసీ ల నీటిని మళ్లించి సాగర్ టైల్ పాండ్ లో కలపడానికి ప్రతిపాదించి, డీపీర్ తయారు చేసి,సుమారు 500 కోట్లు ఖర్చు చేసిన “దుమ్ముగూడెం- నాగార్జున సాగర్ టైల్ పాండ్” ప్రాజెక్ట్ ప్రతిపాదనలను 4-11-2013న అప్పటి కేంద్ర మంత్రి జైరామ్ రమేష్ మంత్రుల బృందానికి ఇచ్చారు. కానీ విభజన చట్టంలో చేర్చలేదు.

సత్యాగ్రహం లో మాట్లాడుతున్న సిబిఐ మాజీ జెడి లక్ష్మినారాయణ

 

రాయలసీమను బ్రతికించడం కోసం ఈ ప్రాజెక్ట్ ను జాతీయ ప్రాజెక్టుగా మార్చాలని ఉద్యమకారులు డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే సాగర్ లో ఆదా అవుతున్న నీటిని శ్రీశైలం ద్వారా రాయలసీమకు కేటాయించి శాశ్వతంగా కరువును నివారించ వచ్చునని వక్తలు పేర్కొన్నారు.

వెనుకపడిన ప్రాంతాల అభివృద్ధికి విభజన చట్టంలో పేర్కొన్న బందెలఖండ్, కోరాపుట్-బోలంగీర్-కలహంటి తరహా  ప్రత్యేక ప్యాకేజి గురించి నాలుగు సంవత్సరాలైనా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదని వారు ప్రశ్నించారు. గతంలో యూపీఏ ప్రభుత్వం జిల్లాకు మంజూరు చేసిన 50 కోట్లు ఇవ్వడంలో కూడా అనేక డ్రామాలు నడుస్తున్నాయని వారు విమర్శించారు.

రాయలసీమ గతంలో చెరువులపైనే ఆధారపడి బ్రతికిందని, ఆ చెరువులను బ్రతికించడానికి “ప్రత్యేక ఇరిగేషన్ కమీషన్”ను ఏర్పాటు చేయాలని, అలాగే కృష్ణా నదీ యాజమాన్య బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయాలని సమావేశం తీర్మానించింది. ప్రజాస్వామిక దేశంలో రాజకీయ పార్టీలు క్రియాశీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని, అందువల్ల ప్రజల డిమాండ్లకు రాజకీయ పార్టీలు స్పందించాల్సి ఉందని, అలాకాకపోతే ప్రజలు తిరుగుబాటు వైపు మళ్లుతారని వారు హెచ్చరించారు.

 

రాజకీయ పార్టీల వైఖరి

 

ప్రస్తుతం చేతిలో ఉన్న అధికారాన్ని “చేతి చలవతో”  అధికారం నిలుపుకోవాలన్న తపనతో ఒక నేత, గతంలో తృటిలో చేజారిన అధికార పీఠం కైవసం చేసుకోవాలని అహర్నిశాలు తపిస్తున్న మరొక నేత, కొత్తగా రంగంలోకి దిగి అందలం అందుకోవాలని ఆశిస్తున్న మరో నేత, రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తూ కరువుసీమ గోడు వినడానికి తీరికలేనంతగా ఎన్నికల  మత్తులో జోగుతున్నారు తప్ప సీమ ప్రజల గోడు పట్టించుకోవడంలేదు.

దేశాన్ని అప్రతిహతంగా పాలించి రాయలసీమను ఎడారిగా మార్చడంలో తన వంతు పాత్ర పోషించి, “ప్రస్తుతం  తమ ఆజన్మ శత్రువు పంచన చేరి” అస్తిత్వం కోసం దేహీ అంటున్న పార్టీ నాయకులు, అలాగే ప్రస్తుతం కేంద్రంలో అధికారం చెలాయిస్తూ రాయలసీమ వెనుకాపాటు తనంపై మొసలి కన్నీరు కారుస్తున్న పార్టీ మరొకటి.

రాయలసీమ గోడు వినిపించుకోకుండా రాజకీయాల మత్తులో జోగుతున్న రాజకీయ పార్టీల  నేతలకు మెలుకువ వచ్చేంత గట్టిగా సీమ రైతులు తమ గళమెత్తి విజయవాడ పురవీధులలో గర్జించారు. మరి ఈ గర్జన శబ్దం రాజకీయ నాయకులకు వినిపించి, వారికి నిద్ర మత్తు వదిలించుకొని రాయలసీమ గోడు పట్టించుకుంటారా? లేక యధావిధిగా నిద్రమత్తులో అలాగే ఉంటారా? అన్నది కాలం నిర్ణయించాల్సి ఉంటుంది.

ఈ కార్యక్రమంలో నాలుగు జిల్లాల నుండి బొజ్జా దశరధ రామిరెడ్డి, రామ్ కుమార్, వెంకటేశ్వరనాయుడు, అప్పిరెడ్డి హరినాథ రెడ్డి, సోమశేఖర వర్మ,భాస్కర్,మాగంటి గోపాల్ రెడ్డి,డాక్టర్ నాగన్న,పురుషోత్తం రెడ్డి,కృష్ణ మూర్తి,వెంకట రెడ్డి,

ప్రభాకరరావు,భాస్కర్ రావు, కోటి రెడ్డి తదితర నేతలు ఈ సత్యాగ్రహంలో పాలు పంచుకున్నారు.