ఆంధ్ర ప్రదేశ్: ప్రభుత్వ భవనాలకు వైసీపీ పార్టీ రంగులు వేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్న అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది. డాక్టర్ శైలజ అనే ఆమె ప్రజాధనాన్ని వైసీపీ నుంచి మంత్రుల నుంచి రికవరీ చేయాలని పిటీషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడానికి నాలుగు వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారని డాక్టర్ శైలజ పిటీషన్ వేశారు. వారి నుంచి వసూలు చేయాలని కోరారు. ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగుల విషయంలో దాఖలు చేసిన పిటిషన్పై పిటిషనర్ తరఫున అడ్వకేట్ డీఎస్ ఎన్ వి ప్రసాద్ బాబు వాదనలు వినిపించారు.
ఈ కేసులో కోర్టు తీర్పు వచ్చే వరకు మాజీ సీఎస్ నీలం సాహ్ని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆపాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రుల నుండి బ్యాంకు గ్యారెంటీ తీసుకోవాలని పిటిషనర్ కోరారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కోర్టు.. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ భవనాలకు రంగులు వేయటం పెద్ద వివాదానికి కారణం అయ్యింది. అయితే ఆ రంగులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాలోని రంగులు అంటూ ప్రతిపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని పంచాయతీ కార్యాలయాలకు వేసిన వైసీపీ రంగులను తొలగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ రంగులను వేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై పంచాయతీ కార్యాలయాలు ప్రభుత్వానివని వాటికి పార్టీ రంగులు ఉండకూడదని హైకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది. తాజాగా మరోసారి విచారణలో హైకోర్టు కీలక సూచనలు చేసింది. 4వేల కోట్ల ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం లెక్క చెప్పాలని హైకోర్టు ఆదేశించింది.