Medical College Privatization: ప్రస్తుతం ఏపీలో రాజకీయం అంతా చంద్రబాబు పీపీపీ వర్సెస్ జగన్ మెడికల్ కాలేజీలు అన్నట్లుగా మారిపోయిందని చెప్పినా అతిశయోక్తి కాదేమో. ఈ సమయంలో ప్రభుత్వ అస్తులు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడానికి చంద్రబాబు తాపత్రయ పడుతుంటే.. వాటిని రక్షించడానికి, పేదలకు అత్యుత్తమ వైద్యం ఉచితంగా అందించడానికి జగన్ ఫైట్ చేస్తున్నట్లు వాతావారణం మారిపోయిందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ ఇచ్చిన వార్నింగ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఈ నేపథ్యంలోనే పలు ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి..!
జనాలు ప్రశ్నిస్తున్నారనో, జగన్ నిలదీస్తున్నారనో కాదు కానీ.. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసే విషయంలో బాబు కరెక్ట్ సమాధానం ఏమిటి?
పైగా ఇప్పటికే.. గవర్నమెంట్ హాస్పటల్స్ కంటే ఇక్కడ మెరుగైన వైద్యం దొరుకుతుందని వ్యాఖ్యానించి దొరికేశాక కూడా.. ఇంకా బొంకితే ఎలా?
ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ముట్టుకుంటే, తాను రాగానే అరెస్ట్ చేస్తా అని జగన్ నేరుగా వార్నింగ్ ఇస్తున్నారంటే.. ఇప్పుడు ముందుకు వచ్చేది ఎవరు?
పైగా జగన్ ఈ స్థాయిలో గట్టిగా నిలబడుతున్నారంటే.. తాను చేస్తున్న పోరాటం నిజాయితీతో కూడుకున్నది.. లేదా, చంద్రబాబు చేస్తున్నది పెద్ద స్కామ్ అని చెప్పకనే చెప్పినట్లేనా?

మెడికల్ కాలేజీలను పీపీపీ పేరు చెప్పి ప్రైవేటు పరం చేసే విషయంలో ఆ విధంగా ముందుకు పోతాను అని చంద్రబాబు అంటుంటే.. ఆరు నూరైనా నూరు ఆరైనా ఈ విషయాన్ని అడ్డుకునే విషయంలో తగ్గేదేలే అన్నట్లుగా జగన్ ముందుకుపోతున్నారు. ఈ క్రమంలో తాజాగా… మెడికల్ కాలేజీలను తీసుకున్నోళ్లను వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు నెలల్లో జైలుకు పంపుతాం అంటు వైఎస్ జగన్ సంచలన వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది.
వాస్తవానికి మెడికల్ కాలేజీల విషయంలో జగన్ ఫస్ట్ నుంచి చాలా సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు. ఈ క్రమంలోనే మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కోటికి పైగా సంతకాలు సేకరించిన సంగతి తెలిసిందే. సంతకాల ప్రతుల్ని తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయం నుంచి గవర్నర్ కార్యాలయానికి తరలించేందుకు జగన్ పచ్చ జెండా ఊపారు. అనంతరం వైసీపీ నాయకులతో నిర్వహించిన సమావేశంలో.. దీని వెనుక ఉన్న స్కాం ను వివరించారు.

ఇందులో భాగంగా… మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పడమే కాకుండా, వాళ్లకు జీతాలు కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందట అని మొదలుపెట్టిన జగన్.. ఈ క్రమంలో ఒక్కో మెడికల్ కాలేజీకి ఏడాదికి ప్రభుత్వమే రూ.120 కోట్లు ఎదురు ఇవ్వడానికి నిర్ణయించారని మండిపడ్డారు. ఇంతకంటే పెద్ద స్కామ్ వుంటుందా? అని ప్రశ్నించారు.
ఈ నేపథ్యంలోనే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీలను తీసుకున్నోళ్లను జైలుకు పంపుతామని.. చంద్రబాబుకు గట్టి గుణపాఠం చెబుతామని జగన్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఇప్పుడు అటు ప్రజల్లోనూ, ప్రధానంగా మేధావి వర్గంలోనూ ఇప్పుడు ఒకటే ప్రశ్న తలెత్తుతోంది. జగన్ ఈ రేంజ్ లో హెచ్చరిక ఇచ్చిన తర్వాత మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో అభివృద్ధి చేయడానికి ఎవరెవరు ముందుకొస్తారు? అని! వేచి చూడాలి మరి!

