‘ధ్యానం’ వైపు ధ్యాస..! ఎన్నో ఉపయోగాలంటున్న నిపుణులు..!!

ప్రస్తుత జీవన విధానంలో ప్రతి మనిషికి ఒత్తిళ్లు, సమస్యలు ఆర్ధిక, కుటుంబ సమస్యలు తోడవుతున్నాయి. వయసు, ఉంటున్న ప్రదేశాన్ని బట్టి ఆలోచనలు మారుతున్నాయి. వీటి నుంచి బయట పడేందుకు కొత్తగా ‘ధ్యానం’ వైపు మళ్లుతున్నారు. మానసిక ప్రశాంతతకు, స్వచ్ఛమైన స్థితి, నిర్మలమైన మనసుకు, ప్రశాంతత, ఏకాగ్రత, ప్రతిభ, ఆలోచనా విధానంలో మార్పుకు ‘ధ్యానం’ ఒకటే మార్గమని నిపుణుల అభిప్రాయం. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పూణే నగరాల్లో 18-60 మధ్య వయస్సు గల 1,000 మందిపై జరిపిన ఓ సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి.

దాదాపుగా మెట్రో నగరాల్లో ప్రజలు మనశ్శాంతి, ఆనందం కోసం ధ్యానంను ఎంచుకున్నారని కొన్ని సర్వేలు చెప్తున్నాయి. వయసును బట్టి ధ్యానంపై ఆధారపడుతున్నారని తేలింది. 18-25 ఏళ్ల వయసు వారు 20, 26-35 వయసు వారు 42, 36-45 సంవత్సరాలు 42, 46-55 వయసు వారు 49, సీనియర్ సిటిజన్లు 41 శాతం.. మనశ్శాంతి, ఆనందం కోసం ధ్యానం చేస్తున్నట్టు పేర్కొన్నారు. 18-25, 46-55 వయసుల వారు శాంతియుత జీవనం, ఆనందం కోసమే కాకుండా సుఖమైన నిద్ర కోసం కూడా ధ్యానం చేస్తున్నట్టు వెల్లడించారు. సీనియర్ సిటిజన్లకు ప్రశాంతమైన నిద్ర, మానసిక ప్రశాంతతను కోరుకుంటున్నారు. ధ్యానాన్ని ఎంచుకోవడానికి గల కారణాలపై జరిపిన ఈ సర్వేలో ఈ ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి.

ధ్యానం చేయడం వల్ల ఒత్తిడిని జయించడం, సుఖమైన నిద్ర దక్కినట్టు తేలింది. వీరందరికీ  మంచి నిద్ర, వ్యక్తిగత ఎదుగుదల, ఒత్తిడిని జయించడం, ప్రశాంతత, బద్ధకాన్ని తగ్గించుకోవడం, మనోబలం వస్తున్నట్టు సర్వేలు చెప్తున్నాయి. వాస్తవంలో పరిస్థితులకు, వారి సమస్యలకు ప్రతి మనిషి జీవన ప్రయాణం ఒక్కోలా ఉంటుంది. దీంతో ఉదయం నిద్ర లేవడం దగ్గర నుంచి ప్రారంభమయ్యే ఒత్తిడి సాయంత్రానికి మరింత ఎక్కువ అవుతుంది. కుటుంబ సమస్యలు, ఆర్ధిక సమస్యలు ఉంటే అవి మరింత ఎక్కువవుతున్నాయి. దీంతో సుఖమైన నిద్రను కోరుకుంటున్నారు. మంచి నిద్ర పడితే ఉదయం ప్రశాంతంగా లేచి కాస్త ధ్యానం చేస్తే ఒత్తిడి నుంచి దూరమవచ్చనే ఆలోచనే వీరిని ధ్యానం వైపు మళ్లిస్తున్నాయని నిపుణులు అంటున్నారు.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించడం జరిగింది. ఈ కథనం మీ అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమమైన మార్గం. గమనించగలరు.