విశాక ఉక్కును ప్రైవేటీకరించాలన్న కేంద్రప్రభుత్వ నిర్ణయం వెలుగుచూడగానే ఉద్యోగులు కార్మికులు వెంటనే ఆందోళన బాటపట్టారు. ఎప్పుడైతే ఆందోళనలు మొదలయ్యాయో వెంటనే గంటా రాజీనామా చేసేశారు. గడచిన ఏడాదిన్నరకు పైగా గంటా ఏ పార్టీలో ఉన్నారో ఆయనకు మరెవరికీ తెలీదు. అలాంటి గంటా హఠాత్తుగా రాజీనామాతో హడావుడి మొదలుపెట్టేశారు. రాజీనామా లేఖ రాసిన గంటా దాన్ని స్పీకర్ తమ్మినేని సీతారామ్ కు పంపారు. అయితే ఆ లేఖలో గంటా ఓ షరతు కూడా పెట్టారు. అదేమిటంటే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేంద్రం ప్రైవేటీకరించిన తర్వాత ఆమోదించాలట. దీంతో రాజీనామా పేరుతో ఎమ్మెల్యే ఆడుతున్న డ్రామా అర్ధమైపోతుంది.
ఇప్పటికప్పుడు గంటా రాజీనామా చేసినట్లు కాదు. పైగా తన రాజీనామాకు కేంద్రం నిర్ణయానికి లింక్ పెట్టారన్నమాట. ఒకవేళ స్పీకర్ రాజీనామాను ఆమోదించాలన్నా సాధ్యంకాదు. ఎందుకంటే సభ్యులు రాజీనామాలు చేసేటపుడు షరతులు విధిస్తే సదరు రాజీనామా చెల్లుబాటు కాదు. అన్నీ విషయాలను తెలుసుకున్న తర్వాత గంటా రాజీనామా డ్రామా ఆడినట్లు అర్ధమైపోతోంది. అయితే మామూలు జనాల్లో మాత్రం గంటా రాజీనామా చేసినట్లు ప్రచారం జరిగిపోయింది.మొత్తానికి దాదాపు రెండేళ్ళుగా గంటా రాజకీయంగా గడ్డు పరిస్ధితిని ఎదుర్కొంటున్నారనే చెప్పాలి. టీడీపీ ఘోరంగా ఓడిపోయినా ఆయన మాత్రం విశాఖ ఉత్తరం నియోజకవర్గంలో గెలిచారు. పార్టీ ఓడిపోయి వైసీపీ ఘన విజయంతో అధికారంలోకి వచ్చింది.
అప్పటి నుండి మనిషేమో టీడీపీలో మనసంతా వైసీపీలో అన్నట్లుగా తయారైంది ఆయన పరిస్ధితి. కొంతకాలానికి గంటా అసలు టీడీపీలోనే ఉన్నారా అనే అనుమానం పార్టీ నేతలకే వచ్చేసింది. ఎందుకంటే వైసీపీలో చేరటానికి గంటా చాలా గట్టి ప్రయత్నాలే చేసినా ఏదీ ఫలించలేదు. ఇదే సమయంలో తమ పార్టీలో చేరమని బీజేపీ అడిగినా మనస్కరించక అటు వెళ్ళలేదనే ప్రచారం తెలిసిందే. దాంతో టీడీపీలో కనబడక వైసీపీలోకి వెళ్ళలేక బీజేపీలోకి వెళ్ళటం ఇష్టంలేక గంటా ఎక్కడున్నారో ఎవరికీ అర్ధం కావటంలేదు. ఇటువంటి పరిస్దితిలో తన ఉనికిని చాటు కోవటానికి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ పేరుతో వచ్చిన అవకాశాన్ని గంటా చక్కగా ఉపయోగించుకుంటున్నారు.