పెగాసస్: రాజకీయ లబ్దిదారులెవరు.? బాధితులెవరు.?

పెగాసస్ అంశం ఇప్పుడు దేశాన్ని ఓ కుదుపు కుదిపేస్తోంది. ప్రజలు పన్నులు కడుతోంటే, తద్వారా వచ్చే వేల కోట్లను కేంద్రం దుర్వినియోగం చేస్తోందనీ, ప్రజలపైనా.. పార్టీలపైనా నిఘా పెట్టేందుకోసం ఆ నిధుల్ని వాడుతోందనీ సంచలన ఆరోపణలు చేశారు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. తన ఫోన్ వాడాలంటే భయమేస్తోందంటూ, దానికి బ్యాండేజ్ వేసేసిన విషయాన్ని ఆమె వెల్లడించడం సంచలనంగా మారింది. గడచిన ఏడేళ్ళ కాలంలో జరిగిన పార్టీ ఫిరాయింపులు.. మరీ ముఖ్యంగా బీజేపీలోకి దూకూళ్ళు జరిగింది ఈ నిఘా వల్లనేనన్న చర్చ దేశవ్యాప్తంగా జరుగుతోంది. అయితే, బీజేపీ మాత్రం.. విపక్షాల ఆరోపణల్ని కొట్టి పారేస్తోంది.

సరే, ఈ రాజకీయ విమర్శల సంగతి పక్కన పెడితే.. ఖచ్చితంగా పెగాసస్ లబ్దిదారులూ వుండే వుండాలి.. అదే సమయంలో పెగాసస్ బాధితులూ వుండి వుండాలి. ఎందుకంటే, పెగాసస్ హ్యాకింగ్ అనేది జరిగింది. ఇందుకు తగ్గ ఆధారాలూ బయటపడ్డాయి. సాక్షాత్తూ ఇద్దరు కేంద్ర మంత్రులు కూడా బాధితులన్న ప్రచారం జరుగుతోంది. వారి మీద మోడీ సర్కార్ వేటు వేసిందన్న గుసగుసలూ వినిపిస్తున్నాయి. ఎలా.? ఇదెలా సాధ్యమయ్యింది.? అంటే, మన ప్రమేయం లేకుండానే మన ఫోన్ల హ్యాకింగ్ జరిగిపోతుంది గనుక.. పెగాసస్ విషయంలో ఎవరైనా బాధితులు కావొచ్చు. పెగాసస్ పుట్టింది ఇజ్రాయెల్‌లో. ఆ ఇజ్రాయెల్‌తో ఒప్పందాలు మోడీ హయాంలోనే ఎక్కువగా జరిగాయి. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ బీజేపీ మీద విమర్శలు చేస్తున్నాయి విపక్షాలు. పెగాసస్ దుమారం ఇప్పట్లో చల్లారేలా లేదు. కానీ, అంతర్జాతీయ ఒప్పందాల నేపథ్యంలో పెగాసస్ విషయంలో కేంద్రం నోరు మెదపడం అనేది అంత తేలిక కాదు. కానీ, భారతీయుల భద్రత ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది గనుక, కేంద్రం పెదవి విప్పాల్సిందే.. లబ్దిదారులెవరో, బాధితులెవరో తేలాల్సిందే.