చంద్ర బాబు, గంటా శ్రీనివాసరావుల మధ్య ఉన్న బంధం ఈనాటిది కాదు రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుబంధం అది. గంటాని బాబు గారికి కుడి భుజం అని కూడా పిలవటం జరుగుతుంది. కానీ ఏమైంది ఏమో ఇప్పుడు గంటా వైఖరి చిత్రంగా ఉంది. గంటా శ్రీనివాసరావు తాజా అసెంబ్లీ సమవేశాలకు హాజరు కాలేదు. ఆయన తన పుట్టిన రోజు సందర్భంగా తిరుపతి దేవుడి సేవలో ఉన్నారు. ఒక వైపు అసెంబ్లీలో వైసీపీ టీడీపీ ఢీ అంటే ఢీ అని ఫైటింగ్ సీన్ క్రియేట్ చేస్తూంటే గంటా శ్రీనివాసరావు మాత్రం ప్రశాంతంగా దైవ సన్నిధిలో గడిపేశారు.
గంటా శ్రీనివాసరావు తాజాగా ఒక సందర్భంలో జగన్ గురించి మాట్లాడుతూ…ప్రజలకు ఏదో మంచి చేద్దామని తపన ఆయనలో ఉందని అంటున్నారు. జగన్ తపన అంతా అందరూ బాగుండాలని ఉంటుందని కూడా చెబుతున్నారు. నిజంగా ఇది జగన్ కి అతి అరుదైన కితాబే. ఆయన ప్రత్యర్ధి పార్టీగా ఉన్న వైసీపీని, జగన్ ని పొగడడం అంటే వింతా విడ్డూరమే. అంతేకాదు, విశాఖలో భూ దందాల గుట్టుని జగన్ వెలికి తీస్తున్నారు. గంటా శ్రీనివాసరావుకు చెందిన భూముల మీద కూడా అధికారులు దాడులు చేస్తే కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నారు. అయినా సరే జగన్ మంచి చేసే సీఎం అంటున్నారు అంటే అందులో ఉన్న మతలబు ఇంకేదో ఉందని అందరూ అనుకుంటున్నారు. .
ఇక చంద్రబాబుని కూడా గంటా శ్రీనివాసరావు తక్కువ చేయడంలేదు. ఆయన రాజకీయంగా అనుభవం ఉన్న నేత అంటూ పొగిడారు. అసెంబ్లీలో చంద్రబాబు వంటి అనుభవం కలిగిన వారు ఉండడం మంచి పరిణామం అని కూడా అంటున్నారు. ఇంత చెప్పిన గంటా శ్రీనివాసరావు అసెంబ్లీ సమావేశాలకు మాత్రం తాను హాజరు కావడంలేదు. ఆయన ఎందుకో టీడీపీకి దూరంగా ఉంటున్నారు. అలాగని వైసీపీకి దగ్గరగా కూడా ఉండడంలేదు. కానీ తన పుట్టిన రోజున మాత్రం జగన్, చంద్రబాబు ఇద్దరూ కలసి రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేయాలని సూచించడం విశేషం. ఇదంతా గమనిస్తున్న వారంతా గంటా కూడా మంచి టైం చూసుకుని వైసీపీ లోకి వెళ్లే ఆలోచనలో ఉన్నారని సమాచారం. బాబుకి దూరమవటం గంటాకి ఏమాత్రం ఇష్టం లేకపోయినా తప్పని పరిస్థితులు అలా చేసేలా ప్రోత్సహిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.