RK Roja: వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి ఆర్కే రోజా గత కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. తనను సొంత పార్టీలోని కొంతమంది నేతలు కావాలని టార్గెట్ చేసి మరీ, తనను తొక్కేస్తున్నారనేది ఆమె ప్రధాన ఆరోపణ. అయితే ఆమె సాక్ష్యాలతో సహా పలు ఆరోపణలు తెరపైకి తేవడం, అటు వైపు నుంచి ఎలాంటి వివరణలు, సవరణలు రాకపోవడం వెరసి పలు ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ఇందులో భాగంగా…
రోజాను వైసీపీలో ఈ రేంజ్ లో టార్గెట్ చేస్తోంది ఎవరు?
నిత్యం జగన్ నామస్మరణ చేస్తూ, ఆయనపై ఎవరైనా విమర్శలు గుప్పిస్తే అంతెత్తున లేచి విరుచుకుపడిన రోజాపై ఇప్పుడు అంత కక్ష ఎవరికుంది?
ఇదంతా టీకప్పులో తుఫానే అని జగన్ ఈ విషయంపై సైలంట్ గా ఉంటున్నారా?
అదీగాక.. జగన్ దృష్టికి ఈ విషయం వెళ్లకుండా “పెద్దలు” పరదాలు కడుతున్నారా?
రోజా అభిమానులు.. వైసీపీ కార్యకర్తల్లో మెదులుతున్న్న ప్రశ్నలు ఇవి!
వాస్తవానికి 2024 ఎన్నికల సమయలోనే సొంత పార్టీ నేతలపై రోజా అసంతృప్తి వ్యక్తం చేశారు! తన వెనుక సొంత పార్టీలోనే ఏదో జరుగుతుందనే సందేహాలు తెరపైకి వచ్చాయి. అయితే.. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా ఆమె తన ఆవేదనను కంటిన్యూ చేస్తుండటం సరికొత్త చర్చకు దారి తీస్తోంది. ఈ క్రమంలో రోజా తాజా ఆరోపణలు సంచలనంగా మారాయి.

తనను అప్రతిష్టపాలు చేయడానికే నగరిలో సొంత పార్టీలోనే “పెద్ద” నాయకులు కుట్ర చేస్తున్నారనేది రోజా ప్రధాన ఆరోపణగా ఉంది. తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు.. తనకు తెలియకుండా సొంతపార్టీలోని కొందరికి పనుల్ని అప్పగించి, ఆర్థికంగా బలోపేతం చేశారనేది మరో సంచలన ఆరోపణ కాగా.. మరో కీలక ఆరోపణ ఏమిటంటే.. అలాంటి వాళ్లందరినీ టీడీపీలోకి పంపి, గత ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా పని చేయించి, ఓడించారని!
అక్కడితో ఆగని ఆమె ఆవేదనతో కూడిన ఆరోపణల పరంపర మరింత లోతుగా వెళ్లింది. ఇందులో భాగంగా… ఎన్నికల తర్వాత తాను తీవ్ర అనారోగ్యానికి గురై, ఆపరేషన్ చేయించుకున్న సందర్భంలో పరామర్శించడానికి మనసు రాని “పెద్ద” మనుషులు… ప్రత్యర్థులను చూడడానికి మాత్రం వెళ్లడాన్ని ఎలా అర్థం చేసుకోవాలలి అని రోజా నేరుగా నిలదీస్తున్నారు. దీంతో… వారెవరనేది వెళ్లినవారికి తెలియంది కాదు అనే చర్చ వైసీపీలో మొదలైంది.
ఏది ఏమైనా… ఆర్కే రోజా విషయంలో ఇప్పటికైనా తాడేపల్లిలోని పెద్దలు జోక్యం చేసుకోవాల్సిందే అనేది వైసీపీ కార్యకర్తలు, ఆమె అభిమానుల మాటగా ఉంది. కొన్ని విషయాలు చినికి చినికి గాలివాన కాకముందే అరికట్టకపోతే.. పార్టీ శ్రేణులకు చెడు సదేశాలు పంపే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఈ విషయంలో నేరుగా జగన్ కల్పించుకుని, ఆమెను పిలిపించుకుని మాట్లాడటమే శుభమని అంటున్నారు. మరి ఈ మాటలు తాడేపల్లి వరకూ వినిపిస్తాయో లేదో వేచి చూడాలి.

