చంద్రబాబుపై హరీష్ రావు సెన్సేషనల్ కామెంట్స్

ఏపీ సీఎం చంద్రబాబుపై టీఆరెస్ నేత హరీష్ రావు విమర్శలు గుప్పించారు. ఆదివారం గజ్వేల్ లో ఎన్నికల సభలో ప్రసంగించారు. చంద్రబాబు.. రాహుల్ గాంధీని కలవడంపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై, మహాకూటమిపై సంచలన వ్యాఖ్యలు చేసారు. టీఆరెస్ గెలుపుపై ధీమా వ్యక్తం చేసారు. ఆ వివరాలు కింద ఉన్నాయి చదవండి.

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో చంద్రబాబు భేటీ అయినప్పటి నుండి చంద్రబాబు నిర్ణయంపై విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇరు రాష్ట్రాల్లోని రాజకీయ ప్రత్యర్ధులు గతంలో కాంగ్రెస్ కి వ్యతిరేకంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు గుర్తు చేసి మరీ కామెంట్స్ చేస్తున్నారు. బీజేపీ, వైసీపీ విమర్శల గురించి చెప్పనక్కర్లేదు. పదునైన విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఇక ఎన్టీఆర్ కి రెండో వెన్నుపోటు పొడిచారంటూ కేటీఆర్ చంద్రబాబుపై ట్విట్టర్లో విమర్శిస్తూ ట్వీట్ పెట్టారు. పలు టీఆరెస్ నేతలు కూడా చంద్రబాబు నిర్ణయాన్ని దుయ్యబట్టారు. ఈ నేపథ్యంలో హరీష్ రావు కూడా చంద్రబాబుపై సెన్సేషనల్ కామెంట్స్ చేసారు.

ఆనాడు సోనియాగాంధీని ఇటలీ దెయ్యం అని విమర్శించినా చంద్రబాబుకు…ఈరోజు సోనియాగాంధీ దేవత ఎలా అయిందంటూ నిలదీశారు హరీష్ రావు. పోటీలో గెలవలేక పొత్తులతో వస్తున్నారంటూ ఎద్దేవా చేసారు. 100 మంది కౌరవులు ఉన్నా న్యాయమే గెలిచిందని, ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుందని అన్నారు. రానున్న ఎన్నికల్లో టీఆరెస్ గెలుపు ఖాయం అని ధీమా వెల్లడించారు హరీష్ రావు. మహాకూటమికి జెండా, అజెండా లేదని, వారికి కావాల్సింది అధికారమేనని దుయ్యబట్టారు.

కెసిఆర్ ను నమ్ముతారా? నక్క జిత్తుల చంద్రబాబును నమ్ముతారా? అని ప్రజలను ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి చంద్రబాబు తెలంగాణకు నష్టం చేయాలనీ చూస్తే ఊరుకోమని హెచ్చరించారు. దమ్ముంటే కాంగ్రెస్ నేతలు చంద్రబాబుతో తెలంగాణాలో ప్రచారం చేయించాలని ఛాలెంజ్ చేసారు. చంద్రబాబు పిచ్చి పిచ్చి వేషాలేస్తే…భవిష్యత్తులో నీ సంగతి చూస్తాం. నీ రికార్డులన్నీ బయట పెడతాం. అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసారు. ఏపీలో ఇప్పుడు ఎన్నికలు వస్తే చంద్రబాబు చిత్తు చిత్తుగా ఓడిపోతారని అన్నారు.