రామ్‌చరణ్‌తో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవాలని ఉంది: మానుషి చిల్లర్‌

‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’తో తెలుగువారికి పరిచయమైన బాలీవుడ్‌ నటి, మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్‌. ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస ప్రాజెక్టులు చేస్తున్న ఆమె .. రామ్‌చరణ్‌ను తాను ఎంతగానో అభిమానిస్తున్నట్లు చెప్పారు. ‘చరణ్‌ అంటే నాకెంతో ఇష్టం. డ్యాన్స్‌ అద్భుతంగా ఉంటుంది. ఎప్పటి నుంచో ఆయనతో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవాలని అనుకుంటున్నా. నా తదుపరి తెలుగు సినిమా ఆయనతోనే ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

‘బడే మియా ఛోటే మియా’ కోసం వయసులో తనకంటే 30 ఏళ్లు పెద్దవాడైన అక్షయ్‌ కుమార్‌తో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడంపై ఆమె స్పందించారు. ‘ఈ విషయంపై ప్రతి ఒక్కరికీ విభిన్న అభిప్రాయాలు ఉన్నాయి. వయసులో పెద్దవారైన పలువురు స్టార్‌ హీరోలతో కలిసి నటించడానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే, స్టార్స్‌తో స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నప్పుడు ఎక్కువ మంది ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించవచ్చు. అక్షయ్‌ కుమార్‌ సూపర్‌ స్టార్‌. ఆయనతో వర్క్‌ చేయడాన్ని నేనెంతగానో ఎంజాయ్‌ చేశా. ఎంతోమంది ఆయనతో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవాలనుకుంటారు. కొంతమందికి మాత్రమే ఆ అవకాశం లభిస్తుంది. తమ చిత్రాల్లోకి నటీనటులుగా ఎవరిని తీసుకోవాలనేది పూర్తిగా దర్శకుల నిర్ణయం.

కాబట్టి దాని గురించి నేను పెద్దగా మాట్లాడాలనుకోవడం లేదు. అగ్ర నటులతోనే కాకుండా యువ హీరోల చిత్రాల్లోనూ నటించాలనుకుంటున్నా‘ అని ఆమె తెలిపారు. 2017లో మిస్‌ వరల్డ్‌ కిరీటాన్ని గెలుచుకున్నారు మానుషి చిల్లర్‌. అక్షయ్‌ కుమార్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘సామ్రాట్‌ పృథ్వీరాజ్‌’తో ఆమె తెరంగేట్రం చేశారు. ‘ది గ్రేట్‌ ఇండియన్‌ ఫ్యామిలీ’, ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ చిత్రాల్లో నటించారు. సందీప్‌ రెడ్డి వంగా తెరకెక్కించిన ‘కబీర్‌ సింగ్‌’లో హీరోయిన్‌గా తొలుత తనకే అవకాశం వచ్చిందని.. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్‌ వదులుకున్నట్లు తెలిపారు.