నా ప్లేస్‌లో దీపిక చేరింది.. ఆమె ఎప్పుడూ కృతజ్ఞతగా ఉండాలి: కరీనా కపూర్‌

బాలీవుడ్‌ నటి కరీనా కపూర్‌ దీపిక పడుకొణెపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో తానొక ప్రాజెక్ట్‌ వదులుకున్నానని, ఆ అవకాశం దీపికను వరించిందని ఆమె అన్నారు. కాబట్టి దీపిక తనకు కృతజ్ఞతలు చెప్పాలని నవ్వుతూ అన్నారు. ఇంతకీ ఆ సినిమా ఏంటి అన్నది తాజా ఇంటర్వ్యూలో చెప్పారామె. బాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ రూపొందించిన ‘రామ్‌ లీలా’ . రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె ముఖ్య పాత్రధారులు. ఈ సినిమా షూట్‌లోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇదిలా ఉండగా, ‘రామ్‌లీలా’ హీరోయిన్‌గా మొదట అవకాశం తనకే వచ్చిందని తాజాగా కరీనా కపూర్‌ తెలిపారు.

‘నేను విధిరాతను నమ్ముతుంటా. మనకు ఏదైతే రాసి పెట్టి ఉంటుందో తప్పకుండా అది జరిగి తీరుతుంది. అన్నీ అందరికీ రాసి ఉండవు. ఆ సినిమా అవకాశం వచ్చినప్పుడు అనుకోని కారణాలతో దానిని అంగీకరించలేదు. దాంతో ఆ అవకాశం దీపికను వరించింది. అలా, రణ్‌వీర్‌తో ఆమె తొలిసారి వర్క్‌ చేశారు. వాళ్లిద్దరి రిలేషన్‌కు పరోక్షంగా నేనే కారణం. కాబట్టి వాళ్లిద్దరూ నాకు కృతజ్ఞతలు చెప్పాలి‘ అని కరీనా చమత్కరించారు.

అలాగే గతంలో వదులుకున్న కొన్ని చిత్రాల గురించి కూడా ఆమె మాట్లాడారు. ‘కల్‌ హో నా హో’లో హీరోయిన్‌గా ఛాన్స్‌ వచ్చినప్పటికీ చేయలేదని అన్నారు. ఒకవేళ ఆ సినిమా చేసి ఉంటే సైఫ్‌ అలీఖాన్‌తో తన బంధం ఎప్పుడో మొదలయ్యేదని అన్నారు. జీవితంలో ఎప్పటికీ సంజయ్‌ లీలా భన్సాలీ మూవీలో యాక్ట్‌ చేయనని గతంలో ఓ సందర్భంలో కరీనాకపూర్‌ చెప్పిన విషయం తెలిపిన సంగతి తెలిసిందే! ‘దేవదాస్‌’ చిత్రంలో ఆఫర్‌ ఇచ్చినట్టే ఇచ్చి లాగేసుకున్నారని, అది తననెంతో బాధించిందన్నారు.

‘దేవదాస్‌’ (2002) హీరోయిన్‌ పాత్రకు సంజయ్‌ లీలా భన్సాలీ మొదట నన్నే ఎంచుకున్నారు. స్క్రీన్‌ టెస్ట్‌ చేసి కాస్త అడ్వాన్స్‌ కూడా ఇచ్చారు.ఫైనల్ గా నా స్థానం వేరే నటిని తీసుకున్నారు. కెరీర్‌ బిగినింగ్‌లోనే ఇలా జరగడం నన్నెంతో బాధించింది. ఒకవేళ నాకు వర్క్‌ లేకపోయినా.. ఆయన సినిమాలో మాత్రం నటించను‘ అని అన్నారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు బీటౌన్‌లో చర్చకు దారి తీశాయి. తాజాగా ‘క్రూ’ సినిమాతో విజయం అందుకున్నారు కరీనా. ప్రస్తుతం ‘సింగం అగైన్‌’ కోసం వర్క్‌ చేస్తున్నారు. రోహిత్‌ శెట్టి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఆమె అజయ్‌ దేవ్‌గణ్‌కు సరసన నటిస్తున్నారు. ఆమె త్వరలో దక్షిణాది చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వనున్నారని టాక్‌ నడుస్తోంది.