ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ హిందూ మతానికి వ్యతిరేకంగా దేవాలయాల మీద దాడులు చేస్తున్నారని, ఇదంతా ఒక వ్యూహం ప్రకారం జరుగుతోంది అంటూ తెలుగుదేశం పార్టీ, జనసేన, బిజెపి ఇలా అందరూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడమే కాకుండా, సంఘటన ప్రాంతాలను సందర్శిస్తూ, ఎక్కడలేని హడావుడి చేస్తున్నారు. గత సంగతులను గుర్తు చేసుకుంటే .. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనూ ఎన్నో ఆపచారాలు జరిగాయి. ఎన్నో గుళ్లను అప్పటి అధికార పార్టీ టిడిపి కూల్చింది. కానీ అప్పుడు ఈ స్థాయిలో ఇంతగా హడావుడి చోటుచేసుకోలేదు. జనసేన, బిజెపి ఈ రేంజ్ లో రియాక్ట్ కాలేదు కానీ ఇప్పుడు మాత్రం పెద్ద రాద్ధాంతమే జరుగుతోంది.
ఒకరకంగా వైసిపి ప్రభుత్వం సైతం ఈ పరిణామాలతో కాస్త ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటోంది. అకస్మాత్తుగా విగ్రహాల సంఘటనలు చోటు చూసుకోవడం, మూడు పార్టీల నాయకులు జగన్ ను టార్గెట్ చేసుకోవడం వెనుక కారణాలు ఇవే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజలకు కనీస అవసరాలైన కూడు, గూడు వంటి వ్యవహారాలపై దృష్టి పెట్టి అందరికీ అన్ని రకాలుగా మేలు చేస్తూ, జనాల గుండెల్లో పాతుకు పోయాడు. ఇదే స్పీడ్ తో జగన్ ముందుకు వెళ్తే, రాబోయే రోజుల్లో ఆయన దూకుడు ఎదుర్కోవడం కష్టం అనే విషయం అన్ని పార్టీలకు అర్థం అయిపోయింది.
ఇప్పుడు బిజెపి, జనసేన, టిడిపి దాడి ప్రారంభించడానికి కారణం కూడా ఇదే అని తెలుస్తోంది. అదీ కాకుండా జగన్ ను ఎదుర్కోవడానికి విడివిడిగా వెళ్తే లాభం లేదని, 2014లో మాదిరిగా మూడు పార్టీలు కలిసి జగన్ అధికారం నుంచి దూరం చేయవచ్చని అభిప్రాయంలో ఆయా పార్టీల అధినేతలు ఉన్నట్లు తెలుస్తోంది. 2022లో ఎన్నికలు వచ్చే అవకాశం కూడా ఉండడంతో, ఇప్పటి నుంచి అన్ని పార్టీలు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. కాకపోతే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునే అవకాశం ఉండదు అనే అభిప్రాయం అందరిలోనూ ఉన్నా, ఎన్నికల సమయం నాటికి అవసరమైతే సోము వీర్రాజు ను ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి సైతం తప్పించాలనే ఆలోచనలో ఆ పార్టీ పెద్దలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. టిడిపి ,బిజెపి , జనసేన పార్టీలు కలవడం ద్వారా ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నేతలు ఎక్కువగా నమ్ముతూ ఉండడంతో ఈ విధంగా జగన్ అందరికీ టార్గెట్ అయినట్టుగా కనిపిస్తున్నారు.