ఏపీ,తెలంగాణా రాష్ట్రాల మధ్య కృష్ణా నదీ జలాల విషయంలో వివాదం నెలకొన్న విషయం తెల్సిందే. ఈ జలవివాదం వ్యవహారంలో ఇరు రాష్ట్రాల మంత్రులు ఒకరిని ఒకరు విమర్శలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి జి.జగదీశ్రెడ్డి గురువారం మీడియాతో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంపైన పలు విమర్శలు చేశారు. ఇరు రాష్ట్రాల మధ్య నీటి పంచాయితీకి కారణం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమేనని ఆయన వ్యాఖ్యానించారు.
కృష్ణా నది నీళ్ల వాడకంపై కేంద్రాన్ని, సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వ తీరును ఆయన తప్పుపట్టారు. ముందుగా ఏపీ ప్రభుత్వం జీవో నంబర్. 203ను ఉపసంహరించుకోవాలని మంత్రి హెచ్చరించారు. కెసిఆర్ స్నేహహస్తాన్ని అందుకోలేక జగన్ ఆకతాయి పిల్లాడిలా చేస్తున్నారని విమర్శించారు. శ్రీశైలం, సాగర్ నీటిని ఉమ్మడి పాలనలో ఇష్టారీతిన వాడుకుని తెలంగాణ ప్రజలను వలసపోయేలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ కడుతున్న ప్రాజెక్టులు అన్ని సక్రమమేనని, ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లినా ఇబ్బంది లేదని మంత్రి పేర్కొన్నారు. నీటి వాటా తేల్చాలని తెలంగాణ ప్రభుత్వం కూడా సుప్రీం కోర్టును అడుగుతుందని వెల్లడించారు. నీళ్ల లెక్కలతో పాటు ఉద్యోగుల, ఆస్తుల లెక్కలు కూడా తేలాల్సిందేనని మంత్రి పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం విజ్ఞతతో వ్యవహరిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని మంత్రి జగదీష్ తెలిపారు.