తెలంగాణ:తెరాస ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం పథకాన్ని ప్రారంభించింది. ఇళ్లు లేని నిరుపేదలకు అన్ని హంగులతో డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించి ఇస్తామని 2014 ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ పార్టీ హామీ ఇచ్చింది. అయితే కొన్ని చోట్ల మినహా అనేక చోట్ల ఇళ్ల నిర్మాణాలు ఇంకా పూర్తి కాలేదు. నిర్మాణం పూర్తయినా.. కొన్ని చోట్ల పంచలేదు. ఈ విషయంపై అధికార పార్టీ ప్రతిపక్షాల నుంచి పలు సందర్భాల్లో విమర్శలు ఎదుర్కొటోంది. అయితే పూర్తి అయిన చోట్ల ఇళ్లను పంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. తొలి విడతలో గ్రేటర్ లోని పేదలకు 1152 ఇళ్లను పంపిణీ చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
మొదటగా జియాగూడలో 840, కట్టేల మండిలో 120, గోడే కా కబర్ 192 ఇళ్ళను పంపిణీ చేసేందుకు నిర్ణయించారు. ఈ ఇళ్లను మంత్రి సోమవారం మంత్రి కేటీఆర్ అర్హులైన పేదలకు పంపిణీ చేయనున్నారు. ఇందుకు ఏర్పాట్లను అధికారులు ప్రారంభించారు. ఆయా ఏర్పాట్లను గ్రేటర్ కు చెందిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యవేక్షిస్తున్నారు. త్వరలోనే జీహెచ్ఎంసీ పరిధిలో నిర్మాణాలు పూర్తయిన డబుల్ బెడ్రూం ఇళ్లను పంపిణీ చేయనున్నట్లు సమాచారం. గ్రేటర్ ఎన్నికల లోపే సాధ్యమైనంతమేర ఇళ్ల పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది.