తెలంగాణ సీఎం కేసీఆర్ అంతకంతకు బలం పెంచుకుంటూ పోతుంటే ప్రతిపక్షాలు కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు అంతర్గత కలహాలతో, సమన్వయ లోపంతో కిందికి జారిపోతున్నాయి. గత ఎన్నికల తర్వాత ప్రతిపక్షాలు కాంగ్రెస్, బీజేపీల్లో కొంత హుషారు, ఉత్సాహం కనిపించినా ఆ తర్వాత అది నీరుగారిపోయే పరిస్థితి. మొదటగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితే చూస్తే ఆ అందులో వర్కింగ్ ప్రెసిడ్ంట్ రేవంత్ రెడ్డి మినహా మిగతా నేతలెవరూ అధికార పక్షం మీద పోరాడుతున్నట్టు కనిపించడం లేదు. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి చేపట్టిన కొత్తలో పార్టీలో చాలామందే సీనియర్లు ఉన్నారు, అందరూ కలిసి పనిచేస్తే కేసీఆర్ ను దీటుగా ఎదుర్కోవచ్చని ఆశించారు రేవంత్. కానీ పరిస్థితి తలకిందులైంది. కేసీఆర్ మీద యుద్ధం చేస్తారు అనుకుంటే అయన మీదే ఇంటిపోరు మొదలైంది.
రేవంత్ ఎదిగిపోతాడనో, తాము కనుమరుగైపోతామనే భయమో తెలీదుకానీ సీనియర్ నాయకులు రేవంత్ చేసే ప్రతి పని మీద విమర్శలు చేయడం, ఆయనకు మద్దతు ఇవ్వకపోవడం చేశారు. దీంతో అనేక సార్లు రేవంత్ ఒంటరిగానే పోరాడాల్సి వచ్చింది. అయినా రేవంత్ వెనకడుగు వేయలేదు. ఒక్కడిగానే కేసీఆర్ ను ఢీకొడుతున్నారు. స్వల్ప వ్యవధిలోనే ఈ విషయం ప్రజలకు కూడ అర్థమైంది. హైకమాండ్ సైతం వ్యవహారం మొత్తం గమనించింది. అందుకే రేవంత్ మీద సీనియర్లు ఎన్ని రహస్య పిర్యాధులు చేసినా పట్టించుకోలేదు. చివరికి కేసీఆర్ అండ్ కో సైతం కాంగ్రెస్ పార్టీలో తమను ఇబ్బంది పెట్టగలిగేది రేవంత్ మాత్రమేనని గ్రహించి దృష్టి మొత్తం అతని మీదే కేంద్రీకరించింది. ఈ పరిణామాలతో రేవంత్ రెడ్డి సూపర్ పాపులర్ అయిపోయారు.
ఇక బీజేపీలో కూడ రేవంత్ రెడ్డి తరహాలో పాలక వర్గం మీద పోరాడుతున్న నేత బండి సంజయ్. పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న ఆయన దూకుడుగానే ముందుకి వెళ్తున్నారు. అయితే ఆయనకు కూడ కలిసి నడిచే నాయకులు కరువయ్యారు. సంజయ్ వద్ద విన్నూత్నమైన ఆలోచనలు చాలానే ఉన్నాయి. పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళగల సత్తా కూడ ఆయనకుంది. కొద్దిరోజుల క్రితం అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంతో ఆ సంగతి రుజువు చేశారు ఆయన. కానీ ఏం లాభం.. ఇద్దరు ముగ్గురు నాయకులు మినహా విశేషంగా సహకరించేవారు పార్టీలో లేకపోవడం ఆయన్ను వెనక్కులాగుతోంది. ఈ రెండు పార్టీల పరిస్థితులను గమనించిన వారు రేవంత్ రెడ్డి, బండి సంజయ్ కష్టాన్ని గుర్తించిన వారు ఒక చిత్రమైన ఆలోచన చేస్తున్నారు.
అదే.. కాంగ్రెస్, బీజేపీల కలయిక. సొంత నేతల సపోర్ట్ లేక ఒంటరిగా పోరాడుతున్న బండి సంజయ్, రేవంత్ రెడ్డిలు గనుక చేతులు కలిపితే కేసీఆర్ వ్యూహాలను సమర్థవంతంగా ఎదుర్కోగరలని అంటున్నారు. కానీ ఉత్తర దక్షిణ ధృవాల్లాంటి కాంగ్రెస్, బీజేపీలు కలుస్తాయా అంటే దానికి సమాధానం చెప్పడం కష్టం. ఒకవేళ అనూహ్య సంఘటనలు చోటుచేసుకుని బండి సంజయ్, రేవంత్ రెడ్డిలు గనుక కలిస్తే అది తెలంగాణ అట్టుడికే వార్తే అవుతుంది.