ఉత్తరాయణ పుణ్యకాలానికి ఆరంభ సూచిక అయిన మకర సంక్రాంతి హిందూ సంప్రదాయంలో అత్యంత విశిష్టమైన రోజుగా భావిస్తారు. ఈ ఒక్క రోజున ఆచరించే కొన్ని నియమాలు, పద్ధతులు జీవితంలో శుభపరిణామాలను తీసుకువస్తాయని పండితులు చెబుతున్నారు. అదృష్టం, ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు అందుకోవాలంటే సంక్రాంతి రోజును ఎలా ప్రారంభించాలి, ఏ పనులు తప్పనిసరిగా చేయాలి అనే విషయాలపై ఇప్పుడు భక్తుల్లో ఆసక్తి నెలకొంది.
సంక్రాంతి ఉదయం బ్రాహ్మీముహూర్తంలో లేచి తలస్నానం చేయడం అత్యంత శుభప్రదమని శాస్త్రాలు పేర్కొంటాయి. మనసును ప్రశాంతంగా ఉంచుకుని భగవంతుని స్మరణతో రోజును ప్రారంభిస్తే ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుందని నమ్మకం. ఇంటి ముందు ముగ్గులు వేసి, పసుపు నీళ్లు చల్లి శుభ్రత పాటించడం ద్వారా లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని విశ్వసిస్తారు.
ఈ రోజు పితృ దేవతలకు అత్యంత ప్రాధాన్యత ఉన్న రోజు కావడంతో తల్లి, తండ్రి వంశాలకు చెందిన పెద్దలను స్మరించి తర్పణాలు, పిండప్రదానం చేయడం మంచిదిగా భావిస్తారు. వీలైనంతవరకు అన్నదానం చేయడం, బ్రాహ్మణులను ఆహ్వానించి భోజనం పెట్టడం ద్వారా పితృదేవతల ఆశీస్సులు పొందవచ్చని పండితుల అభిప్రాయం.
ధనుర్మాసం ముగిసే ఈ పుణ్యక్షణంలో శ్రీ మహావిష్ణువును, మహాలక్ష్మీదేవిని భక్తితో పూజించడం వల్ల ధనసంపత్తి, కుటుంబ సుఖసంతోషాలు పెరుగుతాయని చెబుతారు. బూరెలు, గారెలు, పులిహోర వంటి సంప్రదాయ నైవేద్యాలు సమర్పించడం వల్ల ఇంట్లో శుభకార్యాలకు అనుకూల వాతావరణం ఏర్పడుతుందని విశ్వాసం. సంక్రాంతి రోజున దానం చేసిన ప్రతి వస్తువుకూ రెట్టింపు పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రాలు సూచిస్తున్నాయి. వస్త్రదానం, ఫలదానం చేయడం, హరిదాసులు, గంగిరెద్దుల వారికి దానం చేయడం ఎంతో శుభప్రదం. గురువులకు స్వయంపాకం పెట్టడం ద్వారా జ్ఞానం, ఆత్మబలం పెరుగుతాయని పెద్దలు చెబుతుంటారు.
ఈ రోజున మద్యం, మాంసాహారం పూర్తిగా వర్జించాలి. ఏకభుక్తంగా ఒకే పూట భోజనం చేయడం, బ్రహ్మచర్యం పాటించడం, నేలపై శయనం చేయడం ద్వారా పితృదేవతల అనుగ్రహం మరింత బలపడుతుందని విశ్వసిస్తారు. సంప్రదాయాలను శ్రద్ధగా పాటిస్తూ, భక్తితో మకర సంక్రాంతిని గడిపితే, సర్వదేవతల కృపతో జీవితంలో శుభాలు నిరంతరం కొనసాగుతాయని పండితులు సూచిస్తున్నారు.
