నాగచైతన్య ‘లవ్ స్టోరీ’ గేమ్ ఛేంజర్ అవుతుందా.?

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘లవ్ స్టోరీ’ ప్రేక్షకుల ముందుకొచ్చేస్తోంది. ఈ సినిమా కంటే, నాగచైతన్య – సమంత విడిపోతున్నారా.? కలిసే వుంటారా.? అన్న అంశం చుట్టూనే తెలుగునాట సినీ అభిమానుల్లో ఉత్కంఠ వుంది. నాగచైతన్య, ‘లవ్ స్టోరీ’ ప్రమోషన్ల కోసం వస్తున్న దరిమిలా, సమంతతో వైవాహిక జీవితం గురించి ఏం చెబుతాడా.? అని అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే, నాగచైతన్య మాత్రం పర్సనల్ లైఫ్ గురించి మీడియాతో మాట్లాడేందుకు ఇష్టపడలేదు. సినిమా గురించిన విశేషాలు మాత్రం చాలా అలవోకగా చెప్పేశాడు.. చాలా జోష్ కనిపించింది అతని మాటల్లో.

మరోపక్క సాయి పల్లవి కూడా ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తోంది. ఇదిలా వుంటే, ‘లవ్ స్టోరీ’ సినిమా గేమ్ ఛేంజర్ కాబోతోందన్న చర్చ సినీ వర్గాల్లో నడుస్తోంది. ఇక్కడ గేమ్ ఛేంజర్ అంటే.. కరోనా పాండమిక్ నేపథ్యంలో స్తబ్దుగా వున్న సినీ పరిశ్రమలో కొత్త ఉత్సాహాన్ని నింపడం. అనూహ్యమైన రీతిలో అడ్వాన్స్ బుకింగ్స్ ‘లవ్ స్టోరీ’ సినిమాకి జరగడం గమనార్హం. ఇది నిజంగానే ఆహ్వానించదగ్గ పరిణామం. ‘టక్ జగదీష్’ సినిమా థియేటర్లలోకి వచ్చేందుకు భయపడినప్పటికీ, ‘లవ్ స్టోరీ’ మాత్రం ధైర్యంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.. అదీ థియేటర్ రిలీజ్ ద్వారా. నిజానికి, ‘టక్ జగదీష్’ కారణంగానే ‘లవ్ స్టోరీ’ విడుదల కాస్త ఆలస్యమయ్యింది. ఓటీటీలో విడుదలైన ‘టక్ జగదీష్’ నిరాశపరిచింది. మరి, థియేటర్లలో విడుదల కానున్న ‘లవ్ స్టోరీ’ ఏమవుతుంది.? సంచలన విజయం సాధిస్తుందన్నది ‘లవ్ స్టోరీ’ టీమ్ నమ్మకం. పాటలు ఇప్పటికే మంచి విజయాన్ని అందుకున్నాయి. సినిమాపైనా భారీ అంచనాలున్నాయి.