Ground Reality : జనసేన పార్టీని అధికార వైసీపీ అయినా, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ అయినా, ‘నిర్లక్ష్యం’ చేయలేని, చేయకూడని పరిస్థితి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో వుంది. అలాగని, జనసేన పార్టీ బలం పుంజుకుందనీ, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే స్థాయిలో బలపడిందనీ కాదు అర్థం. ఖచ్చితంగా ఎవరో ఒకరి విజయావకాశాల్ని దెబ్బతీసేలా లేదా ఇంకొకరి విజయావకాశాల్ని పెంచేలా మాత్రం జనసేన పార్టీ ప్రబావం వుంటుంది.
బీజేపీ – జనసేన కలవడం వల్ల ఆ రెండు పార్టీల్లో ఎవరికి ప్రయోజనం.? అంటే, నో డౌట్.. భారతీయ జనతా పార్టీకే. కొద్దోగొప్పో నష్టమే తప్ప జనసేనకు బీజేపీ వల్ల లాభం లేదు. అదే టీడీపీ – జనసేన కలిస్తే, టీడీపీకి లాభం చేకూరుతుంది. జనసేనకూ ఎంతో కొంత లాభం వుండి తీరుతుంది. టీడీపీ – జనసేన – బీజేపీ.. ఈ మూడూ కలిస్తే ఖచ్చితంగా వైసీపీకి నష్టం జరుగుతుంది. అదెంత స్థాయిలో.? అన్నది ఇప్పుడే చెప్పలేం.
ఇదే వైపీపీకి ఆందోళన కలిగిస్తోంది. జనసేన – టీడీపీ కలవనంతవరకు వైసీపీకి ఇబ్బందేమీ లేదు. అందుకే, జనసేన – టీడీపీ కలవకుండా వుండేందుకు ఏం చేయాలో అంతా చేస్తోంది వైసీపీ. కాగా, జనసేన పార్టీని తమ దారిలోకి తెచ్చుకునేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు వ్యూహ రచన చేస్తున్నారు. బీజేపీని కూడా ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారాయన.
ఖచ్చితంగా జనసేన పార్టీ వల్ల వైసీపీ వ్యతిరేక ఓటు చీలుతుందన్న భావన టీడీపీ అధినేతలో వుంది. అందుకే, అది చీలకుండా వుండాలంటే టీడీపీ – జనసేన అలాగే బీజేపీ కూడా కలవాలన్నది టీడీపీ ఉవాచ. ఒంటరిగా పోటీ చేస్తే జనసేన కొన్ని సీట్లు ఈసారి గెలచుకోగలగుతుందనీ, అయినాగానీ సింగిల్ డిజిట్ దాటబోదనీ అంచనా వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. దీనివల్ల టీడీపీ దారుణంగా దెబ్బ తినబోతోందట.