ఏం చేసినా నారా లోకేష్ రాజకీయంగా ఎదగలేకపోతుండడాన్ని జీర్ణించుకోలేకపోతున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, తన అసహనాన్ని ఓటర్ల మీద చాటుకుంటున్నారా.? అంటే, ఔననే వాదన బలంగా వినిపిస్తోంది. తన పుత్ర రత్నానికి ఎమ్మెల్సీగా అవకాశమిచ్చి, మంత్రి పదవిలో కూర్చోబెట్టగలిగారుగానీ, అతన్ని ఎమ్మెల్యేగా గెలిపించలేకపోయిన చంద్రబాబు, తాను తిరిగి అధికారంలోకి రావడం ఎలా.? అన్న ఆవేదనతో రగిలిపోతున్నారు.
ఇటీవల కురిసిన బారీ వర్షాలు, ఆ కారణంగా వచ్చిన వరదల నేపథ్యంలో చంద్రబాబుకి ఓ అద్భుతమైన అవకాశమొచ్చింది.. ప్రజలకు చేరువయ్యేందుకు. కానీ, ఆ వరద పర్యటనని కూడా తన సొంత పబ్లిసిటీకి చంద్రబాబు వాడుకుని అభాసుపాలైపోయారు. చంద్రబాబు సతీమణిపై వైసీపీ శాసనసభ్యులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వ్యవహారం వరద బాధితులకు పరామర్శ సందర్భంగా ప్రచారాస్త్రమయ్యింది.
ఇక్కడే చంద్రబాబు బోల్తా పడ్డారు. ముఖ్యమంత్రి ఎక్కడా.? అంటూ, చంద్రబాబు నిలదీశారు. గాల్లోనే వస్తాడు, గాల్లో కలిసిపోతాడు.. అంటూ చంద్రబాబు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో ప్రజల్లో టీడీపీ పట్ల నెగెటివిటీ పెరిగిపోయింది. చంద్రబాబు డిమాండ్ చేశారని కాదు, ముఖ్యమంత్రిగా తన బాద్యతను గుర్తించి జనంలోకి వెళ్ళారు వైఎస్ జగన్.
సహజంగానే ముఖ్యమంత్రి పర్యటన పట్ల బాధిత ప్రజల్లో కొంత ఆసక్తి వుంటుంది.. ముఖ్యమంత్రి తమకు సాయం చేస్తారన్న ఆశ కూడా బాధితుల్లో వుంటుంది. ముఖ్యమంత్రిని నిలదీయడం కంటే, ముఖ్యమంత్రికి తమ బాధల్ని చెప్పుకోవాలని జనం భావించడాన్ని ఆహ్వానించాల్సిందే.
వరద బాధితులు ముఖ్యమంత్రిని నిలదీయకపోవడమేంటి.? ముఖ్యమంత్రిని పొగడటమేంటి.? అంటూ చంద్రబాబు ఆవేశంతో ఊగిపోతున్నారు. నిజానికి ఇదంతా చంద్రబాబు ఫ్రస్ట్రేషన్ తప్ప.. హుందాతనం కానే కాదు. రాజకీయంగా అసమర్థుడైన కుమారుడి మీద అసహనాన్ని చంద్రబాబు ఇలా చాటుకుంటున్నారన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.
Chandra Babu