కేసీఆర్ను రెండు దఫాలు ముఖ్యమంత్రి అయ్యారు. ఇది ఆయన రెండవ టర్మ్. ఇప్పటికీ ఆయన్ను ఎదుర్కొనే విషయంలో ప్రత్యర్థి పార్టీలు చతికిలబడుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అయితే ఏం చేయాలి, ఎలా చేయాలి అనుకుంటూ కాలం గడుపుతోంది. అందుకు ఫలితమే ఎంపీ రేవంత్ రెడ్డి సింగిల్ జర్నీ. పేరుకి ఆయన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా ఆయనతో కాంగ్రెస్ పెద్దలెవరూ కలవట్లేదు. అదే వారి డ్రాబ్యాక్. ఇక మరొక అపోనెంట్ బీజేపీ. ఈ పార్టీకి ఇతర పార్టీలతో జాతీయ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు అంటూ రెండు విధానాలను అవలంభిస్తుంటుంది. ఆ ప్రకారం తెలంగాణలో వారు తెరాసకు వ్యతిరేకం. కానీ కేసీఆర్ను ఢీకొట్టడానికి వారి వద్ద ప్రజాకర్షణ కలిగిన నేతలు కరువయ్యారు.
అందుకే వారు రాష్ట్ర రాజకీయాలను జల్లెడపట్టి కొత్త లీడర్లను పార్టీలోకి తీసుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. ప్రజెంట్ వారు కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతిని తమతో కలుపుకోవాలని చూస్తున్నారు. విజయశాంతి స్టేచర్ చిన్నదేమీ కాదు. చాలాకాలం రాజకీయాలకు దూరంగా ఉండబట్టి ఆమె ప్రజలకు దూరమయ్యారు కానీ లేకుంటే ఆమెకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. గతంలో ఆమె బీజేపీలో ఉండి కాంగ్రెస్ గూటికి చేరారు. గత ఎన్నికలకు ముందే ఆమె కాంగ్రెస్ పెద్దల ఒత్తిడితో రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. కానీ ఎనికల్లో పోటీకి మాత్రం ఆమె సుముఖంగా లేరు. దుబ్బాక ఉపఎన్నికల్లో కాంగ్రెస్ ఆఫర్ ఇచ్చినా ఆమె కాదన్నారట.
ఇప్పుడు ఈమెనే తమ పార్టీలోకి లాక్కోవాలని బీజేపీ భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో టాక్ వినబడుతోంది. కేసీఆర్ లాంటి బడా లీడర్ను ఢీకొట్టాలంటే విజయశాంతి లాంటి ఫైర్ బ్రాండ్ ఉండాల్సిందేనని, అప్పుడే పార్టీకి లోకల్ టచ్ కూడ ఉంటుందని భావించిన కమలనాథులు ఆమెకు రాజ్యసభ సీటు ఇవ్వడానికి కూడా రెడీ అయ్యారని అంటున్నారు. విజయశాంతి వద్దకు ఈ ప్రపోజల్ పంపబడిందని అందుకే ఆమె ఉపఎన్నికల్లో టికెట్ కాదన్నారని చెప్పుకుంటున్నారు. మరి ఈ వార్తలే నిజమైతే రాములమ్మ మళ్లీ కషాయ కండువా కప్పుకుంటారేంమో చూడాలి.