అసలేమయ్యింది తెలుగుదేశం పార్టీకి.? ఆ పార్టీ గురించి ‘రెస్ట్ ఇన్ పీస్’ అనే ప్రచారం సోషల్ మీడియాలో ఎందుకు జరుగుతోంది.? ఇంకెందుకు, తెలుగుదేశం పార్టీ జెండా పీకెయ్యాలనే నిర్ణయానికి చంద్రబాబు రావడంతోనే ఇదంతా. బాలయ్యా.. పార్టీ పగ్గాలు తీసుకోవయ్యా.. అని నందమూరి అభిమానులు కోరుతున్నారు. అదే నందమూరి అభిమానులు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు చేపడితే ఇంకా బావుంటుందని అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో టీడీపీకి చంద్రబాబు సమాధి కట్టేశారని ఆరోపిస్తోన్న కొందరు తెలుగు తమ్ముళ్ళు.. త్వరలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ వద్దకు స్వయంగా తమ ఆవేదనను తీసుకెళ్ళడానికీ ప్రయత్నిస్తున్నారట. గడచిన నలభయ్యేళ్ళలో ఏనాడూ టీడీపీ ఇంతటి సంక్షోభాన్ని చవిచూడలేదన్న ఆవేదన వారిలో కనిపిస్తోంది. ఓ రాజకీయ పార్టీ, అందునా ప్రధాన ప్రతిపక్షం.. పరిషత్ ఎన్నికల్ని బహిష్కరించడమేంటి.? ఆ బహిష్కరణ నిర్ణయాన్ని పార్టీ శ్రేణులు లెక్కచేయకపోవడమేంటి.? ఈ ప్రశ్నలు తెలుగుదేశం పార్టీలో అల్లకల్లోలానికి కారణమవుతున్నాయి.
తిరుపతి ఉప ఎన్నికను కూడా బహిష్కరించేస్తే ఓ పనైపోతుందన్న ఆవేదన వారిలో కనిపిస్తోంది. దాంతో, తిరుపతి టీడీపీ అభ్యర్థి పనబాక గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయిప్పుడు. పార్టీకి చెందిన ముఖ్య నేతలంతా తిరుపతి లోక్ సభ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నా, అక్కడెవరూ టీడీపీని పట్టించుకోవడంలేదు. చంద్రబాబు మరోమారు పార్టీకి వెన్నుపోటు పొడిచారని టీడీపీ కార్యకర్తలు, తనను అనవసరంగా బరిలోకి దింపి, ఇరికించారని పనబాక లక్ష్మి ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. మరోపక్క, సోషల్ మీడియాలో రెస్ట్ ఇన్ పీస్.. అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ అవడంతో, తెలుగు తమ్ముళ్ళు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది. సంక్షోభాల్ని అవకాశాలుగా మార్చుకోగలనని చెప్పే చంద్రబాబు, ప్రతిసారీ ఆ సంక్షోభాలకు తానే కారకుడవుతుండడం గమనార్హం