మీడియాపై కస్సుబుస్సలాడిన అనసూయ

జబర్దస్త్ బ్యూటీ, సినీ నటి అనసూయ భరద్వాజ్, తాజాగా జరిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ‘మా’ ఎన్నికల్లో ఈసీ మెంబర్‌ అభ్యర్థిగా ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి పోటీ చేసిన విషయం విదితమే. ఆమె గెలిచినట్టు తొలుత ప్రచారం జరిగింది. కానీ, ఆ తర్వాత ఆమె ఓడిపోయినట్టుగా తేలింది.

ఇక, ఈ అసహనం అంతా ఆమె మీడియాపై చూపించినట్టంది. నిన్నటి మీడియా సమావేశంలో అనసూయ, నిజా నిజాలు తెలుసుకోకుండా తప్పుడు ప్రచారాలెందుకు చేస్తారంటూ జర్నలిస్టులపై గుస్సా అయ్యిందామె. ‘నేను కూడా మీడియాలో వున్నాను.. ఒకప్పుడు జర్నలిస్టుగా పనిచేశాను. నేనే రిపోర్టింగ్ చేయాల్సి వస్తే.. రిపోర్టింగ్ మాత్రమే చేస్తాను. వార్తల్ని క్రియేట్ చేయను..’ అంటూ మీడియాకి అనసూయ క్లాస్ తీసుకుంది.

నేటి మీడియా పోకడలు ఎలా వున్నాయో అనసూయకి తెలియదని ఎలా అనుకోగలం.? మీడియా అంటే వార్తల్ని రిపోర్టింగ్ చేయడం కాదు, వార్తల్ని క్రియేట్ చేయడం.. అన్నట్టుగా మారిపోయింది ట్రెండ్. ఆ ట్రెండ్ మీడియాలో పెరిగాకే, అనసూయ మీడియాలో జర్నలిస్టుగా పనిచేసింది.

ఇదిలా వుంటే, తన మీద తప్పుడు ప్రచారాలు చేస్తే, కోర్టుకెళతానంటూ అనసూయ సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై అసహనం వ్యక్తం చేయడం గమనార్హం.