అప్పుడే ప్రయాణాల వల్ల కరోనా సోకదు !

 
కరోనా మహమ్మారి విజృంభన ఆగకపోయినా..  లాక్ డౌన్ సడలింపులతోనే ముందుకు వెళ్ళక తప్పని పరిస్థితి. ఇక తెలంగాణ నుంచి ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రకు వెళ్లే ప్రయాణికులకు  రాష్ట్ర డీజీపీ కార్యాలయం శుభవార్త చెప్పింది. ఆయా రాష్ట్రాల రిజిస్ట్రేషన్ యాప్‌ లలో ప్రయాణ వివరాలను  నమోదు చేసుకోని వెళ్లిపోవచ్చు అట. ఏపీ వెళ్లాల్సిన వారు స్పందన యాప్‌ లో,  అలాగే కర్ణాటకకు వెళ్లాలనుకుంటే సేవా యాప్‌లో ఇలా ఏ రాష్ట్రానికి వెళ్లాలనుకుంటే   ఆ రాష్ట్ర పోర్టల్‌ లో వివరాలను నమోదు చేసుకోని వెళ్లిపోవచ్చు  అని డీజీపీ కార్యాలయం స్పష్టం చేసింది. ప్రయాణికులకు ఇది నిజంగా శుభవార్తే. ఇన్నాళ్లు ఇల్లు దాటడానికే భయపడ్డ జనం  ఇప్పుడు సులభంగా వేరే రాష్ట్రానికి కూడా వెళ్లిపోవచ్చు. ఇప్పటికే  తెలంగాణకు వచ్చే వాహనాలకు పాసులు కూడా అడగడం లేదు. 
 

 

కానీ ఏపీ డీజీపీ కార్యాలయం మాత్రం  తమ ప్రభుత్వం అంతర్రాష్ట్ర కదలికల పై తదుపరి నిర్ణయం తీసుకొనేంత వరకు  ప్రస్తుతం అమల్లో ఉన్న షరతులనే  కొనసాగిస్తామని ఏపీ డీజీపీ సవాంగ్ స్పష్టం చేశారు.  ఇతర రాష్ట్రాల నుంచి రోడ్డు మార్గాన ఆంధ్రప్రదేశ్ రావాలనుకునే ప్రయాణికులు ఖచ్చితంగా స్పందన పోర్టల్ ద్వారా ఈ-పాస్ తీసుకుంటేనే వారిని రాష్ట్రంలోకి అనుమతి ఇస్తామని ఆయన తెలిపారు. మరి పక్క పక్కన ఉన్న తెలుగు రాష్ట్రాలలోనే ఇలా  వేరు వేరుగా నియమాలు ఉంటే అది ప్రయాణికులకే కదా ఇబ్బంది. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు ఆంధ్ర పోలీస్ విభాగం ప్రయాణికుల అవస్థలను దృష్టిలో పెట్టుకునైనా  ఈ-పాస్ ల పై సాధ్యమైనంత త్వరగా  తుది నిర్ణయం తీసుకుంటే మంచింది.       

 

అలాగే ప్రయాణాలు కూడా ఎక్కువైపోతే  కరోనా కూడా ఎక్కువైయ్యే అవకాశం లేకపోలేదు. కాబట్టి  కరోనా ప్రభావం తక్కువగా ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చే వారు హోం క్వారంటైన్‌ లో ఉండాలి. వారు అలా ఉండేలా చూడల్సిన బాధ్యత  ప్రభుత్వాలకు ఉంటుంది. ముఖ్యంగా కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చే వారు 7 రోజులు ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్‌లో ఉండి అన్ని టెస్టులు చేయించుకోవాలి. ఒకవేళ పాజిటివ్ వస్తే కోవిడ్ ఆస్పత్రికి పంపాలి. అప్పుడే ఈ ప్రయాణాలు వల్ల కరోనా వ్యాప్తి చెందదు.