విడుదలకు ముందే ‘పుష్పది రూల్‌-2’ రికార్డులు!

‘పుష్ప-2 ది రూల్‌’ సినిమా కోసం ప్రేక్షకలోకం ఏ విధంగా ఎదురుచూస్తుందో తెలియంది కాదు. ‘పుష్ప ది రైజ్‌’ తో ప్రపంచ సినీ ప్రేమికులను అలరించిన ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ . ‘పుష్ప -2 ది రూల్‌’తో నిజంగా రూల్‌ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి వినబడుతోన్న బిజినెస్‌ వార్తలు చూస్తుంటే.. ఇది కదా రూల్‌ అంటే.. అని అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ కాలర్‌ ఎగరేస్తున్నారు. రీసెంట్‌గా అల్లు అర్జున్‌ బర్త్‌డేని పురస్కరించుకుని విడుదల చేసిన టీజర్‌ రికార్డులు క్రియేట్‌ చేసి యూట్యూబ్‌లో ట్రెండ్‌సెట్టర్‌గా నిలిస్తే.. తాజాగా ఈ చిత్ర డిజిటల్‌ రైట్స్‌ ఆల్‌ టైమ్‌ రికార్డ్‌ ధరకు అమ్ముడైనట్లుగా పరిశ్రమవర్గాల్లో టాక్‌ నడుస్తోంది.

ఇప్పటికే ’పుష్ప-2 ది రూల్‌’ సినిమా నార్త్‌ ఇండియా డిస్టిబ్య్రూషన్‌ రైట్స్‌ను రికార్డు స్థాయిలో రూ. 200 కోట్లకు అనిల్‌ తడాని సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తుండగా.. ఇప్పుడు డిజిటల్‌ రైట్స్‌ను నెట్‌ప్లిక్స్‌ సంస్థ రూ. 250 కోట్ల వరకు కోట్‌ చేసినట్లుగా సినీ సర్కిల్స్‌లో ఓ వార్త వైరల్‌ అవుతోంది. ఇది నిజమే అయితే మాత్రం అల్లు అర్జున్‌ ఆల్‌ టైమ్‌ రికార్డ్‌ సాధించినట్టే. ఇంతకు ముందు రూ. 170 కోట్లతో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా పేరు మీద ఈ రికార్డ్‌ ఉంది. ఆ రికార్డును చెరిపేస్తూ..’పుష్ప -2 ది రూల్‌’ అన్ని భాషలకు కలిపి డిజిటల్‌ రైట్స్‌ రూ. 300 కోట్ల వరకు వెళ్లే అవకాశం ఉన్నట్లుగా టాక్‌ వినబడుతోంది.

దీంతో.. ఇదొక్కటి చాలు.. పుష్పరాజ్‌ రూల్‌, రూలింగ్‌పై ఎలాంటి క్రేజ్‌ ఉందో చెప్పడానికి.. అనేలా ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ చేస్తుండటం విశేషం. ఐకాన్‌స్టార్‌ నటన, బ్రిలియంట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వ ప్రతిభ, మైత్రీ నిర్మాణ విలువలు, దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌.. ఇలా ప్రతీది ‘పుష్ప’ సినిమాను ప్రపంచానికి చేరవేశాయి. 2024 ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా పుష్పరాజ్‌ ఆడే గంగమ్మ జాతర కోసం.. సినీ ప్రపంచమే వెయిట్‌ చేస్తుందంటే.. అస్సలు ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పనులన్నీ శరవేగంగా జరుగుతున్నట్లుగా రీసెంట్‌గానే మేకర్స్‌ ప్రకటించారు.