గతంలో వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీని బహిష్కరించినప్పుడు వారికి ప్రతిపక్ష బాద్యతలను ఎలా నిర్వహించాలో తెలియడం లేదని చంద్రబాబు నాయుడు సహా టీడీపీ నేతలంతా హేళన చేశారు. కానీ ఇప్పుడు అదే టీడీపీ ప్రతిపక్షంగా కనీసం నొరెత్తి మాట్లాడలేని దయనీయ స్థితిలో చిక్కుకుపోయింది. అప్పుడు జగన్, ఆయన నేతలు అసెంబ్లీలో మాట్లాకపోయినా బయట చంద్రబాబు పాలనను తిట్టిన తిట్టు మళ్లీ తిట్టకుండా తిట్టేవారు. చంద్రబాబును జగన్ బృందంలోని చోటా లీడర్లు సైతం ఏకిపారేసేవారు. కానీ ఆ పని టీడీపీ నాయకులు చేయలేకపోతున్నారు. అసలు తెలుగుదేశం పార్టీలో ఒకప్పుడు హడావుడి చేసిన నేతల్లో సగం మంది ఇప్పుడసలు కనిపించడమే లేదు. దీనికి కారణం.. భయం. వైఎస్ జగన్ క్రియేట్ చేసిన భయం.
కోడెల నుండి కొల్లు రవీంద్ర వరకు
జగన్ అధికారంలోకి రాగానే టీడీపీ నేతల అరచకాలు, అవినీతి మీద యుద్దం ప్రకటించేశారు. ఎవ్వరినీ వదిలేది లేదని నేరుగా వార్నింగ్ ఇచ్చారు. ఆ వెంటనే వల విసిరారు. ఆ వలలో చిక్కిన మొదటి నేత కోడెల శివప్రసాద్. కోడెల టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎలా చక్రం తిప్పారో అందరికీ తెలుసు. రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా ఉండేవారు. అలాంటి ఆయన చివరికి ఆత్మహత్య చేసుకుని తనువు చాలించారు. కోడెల, ఆయన కుటుంబం మీద కే ట్యాక్స్ ఆరోపణలు పెనుదుమారాన్ని రేపాయి. ఆ తర్వాత గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మీద అక్రమ మైనింగ్ కేసులు పడ్డాయి. ప్రస్తుతం సీబీఐ పరిధిలో ఉన్న కేసుల్లో విచారణ వేగంగా జరుగుతోంది. రేపో మాపో ఆయన జైలుకెళ్లడం ఖాయం అంటున్నారు.
అలాగే టీడీపీ హాయాంలో విర్రవీగిన చింతమనేని ప్రభాకర్ అధికారం కోల్పోయాక ఏమయ్యారో అందరం చూశాం. ఆయన స్పీడుకు జగన్ ప్రభుత్వం చాలా బ్రేకులే వేసింది. ఇక తాజాగా ఈఎస్ఐ కుంభకోణంలో అరెస్టైన అచ్చెన్నాయుడు రెండున్నర నెలలు కస్టడీలో ఉండి ఇటీవలే బెయిల్ పొందారు. ఆరోగ్యం బాగోలేదని కూడ చూడకుండా అచ్చెన్నను చాలా కష్టపెట్టారు. జేసీ దివాకర్ రెడ్డి రవాణా శాఖ కేసుల్లో రెండు నెలలు జైల్లో ఉండి బెయిల్ పొందారు. అలాగే కొల్లు రవీంద్ర హత్య కేసులో అరెస్టై ఒకటిన్నర నెల జైల్లో గడిపి ఇటీవలే బయటికొచ్చారు. వీరే కాదు సొమిరెడ్డి మీద ఫొర్జెరీ కేసు, అయ్యన్నపాత్రుడు మీద నిర్భయ కేసు, చినరాజప్ప, యమమల, నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావుల మీద కేసులు పడ్డాయి.
వారిని చూసి వణుకుతున్నారు
ఇక వీరందరనీ చూశాక మిగతా లీడర్లలో వణుకు మొదలైంది. టీడీపీ లీడర్లు మేము ఎవరికీ భయపడబోమని చెప్పుకుంటే అబద్దమే అనాలి. టీడీపీ నుండి ఏ ఒక్క లీడర్ కూడ వైసీపీని దీటుగా టార్గెట్ చేయలేకపోతున్నారు. చంద్రబాబు మినహా మిగతావారి గొంతుల్లో ధైర్యమనే మాటే లేదు. ఏ ఒక్కరూ ప్రెస్ మీట్ పెట్టి జగన్ మీద ఛాలెంజెస్ విసరలేకపోతున్నారు. కనీసం తమ తోటి లీడర్లు కేసుల్లో జైలుకి వెళుతున్నా నోరెత్తి మాట్లాడలేకున్నారు. మాట్లాడితే ఎప్పుడు ఏ కేసు మీద పడుతుందో, పోలీసులు తీసుకెళతారేమోనని భయపడుతున్నారు. యువ నాయకత్వమైతే పూర్తిగా తోకముడిచేసింది.
అందరూ సెల్ఫ్ ఐసోలేషన్ నియమాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు. అందరిలోనూ ఒకటే ఆలోచన.. ఇంకా నాలుగేళ్లు ఉంది.. పరిస్థితి ఇలాగే ఉండి మనం బయటికి రాకుండా మౌనంగానే ఉంటే జనం మనల్ని మర్చిపోవడం ఖాయమని, అలాగని బయటికొచ్చి హడావుడి చేస్తే ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనని తెగ ఆందోళన చెందుతున్నారు. వాటికి తోడు ఆర్థిక మూలాల మీద గురిపెడుతుండటంతో వారి భయం రెట్టింపయింది. దాంతో ఎందుకైనా మంచిది జగన్ ద్రుష్టిలో పడకపోవడమే మంచిదని గప్ చుప్ అన్నట్టు ఉండిపోయారు. వారి వ్యవహారం చూస్తే ఇప్పుడప్పుడే బయటికొచ్చేలా లేరు. మొత్తానికి జరుగుతున్న జగన్నాటకం వారిలో భయాన్ని నిలువెల్లా నింపేసింది..