వైఎస్ జగన్ చంద్రబాబు మీద భారీ సీట్ల మెజారిటీతో విజయం సాధించడానికి కారణం టీడీపీ ప్రభుత్వం మీద అవినీతి ఆరోపణలు రావడమే. వైఎస్ జగన్ ఎప్పుడైతే అసెంబ్లీ బహిష్కరించి బయటికొచ్చారో అప్పటి నుండి బాబుగారి ప్రభుత్వం మీద అవినీతి ఆరోపణలు మొదలుపెట్టారు. ముఖ్యంగా అమరావతి విషయంలో చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలు అడుగడుగునా అవినీతి చేసినట్టు జగన్ మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో సైతం తాము అధికారంలోకి వస్తే తక్షణమే అవినీతిని తవ్వి తీస్తామని, చంద్రబాబు సహా టీడీపీ నేతలందరినీ జైలుకి పంపుతామని ప్రకటించారు. కావాలనే అమరావతిని రాజధాని ప్రాంతంగా ఎంచుకున్నారని, ముందే అక్కడి భూములన్నీ టీడీపీ నేతలు, వారి బినామీలు భారీ ఎత్తున కొనుగోలు చేసి పెట్టుకున్నారని అన్నారు.
జగన్ మాటలు నమ్మేశారు జనం:
వైఎస్ జగన్ అండ్ కో చాలా వివరంగా అమరావతిలో జరిగిన అవినీతి గురించి మాట్లాడారు. వందల ఎకరాల భూములు టీడీపీ నేతలవే. సిండికేట్లుగా ఏర్పడి కొనేశారు. భూములు ఇవ్వమన్న రైతుల నుండి బలవంతపు సేకరణ చేశారు. తక్కువ ధరలకే భూములు కొన్న వారంతా ప్రభుత్వానికి ఎక్కువ ధరకు అమ్మి సొమ్ము చేసుకున్నారు. అన్ని రకాల బెనిఫిట్స్ అందుకున్నారు. పరిహారంగా కేటాయించే భూముల్లో మంచివాటిని టీడీపీ నేతలు, బినామీలకు దక్కగా సామాన్య జనాలను అవకతవకగా ఫ్లాట్లు కేటాయించారు. ఒక్కమాటలో చెప్పాలంటే అమరావతిలో రియల్ ఎస్టేట్ బిజినెస్ జరిగింది. రైతుల వద్ద కొన్నది, ప్రభుత్వానికి అమ్మిందీ చంద్రబాబు బినామీలే అన్నారు.
ఈ ఆరోపణలకు అమరావతి ప్రాంతంలో టీడీపీ లీడర్లు చేసిన హడావుడి బలం చేకూర్చింది. టీడీపీ నేతలు కొందరు నేరుగానే వెళ్లి అమరావతి గ్రామాల్లో తిరుగుతూ భూములు కొన్నారు. కొందరు రియల్టర్లు ప్రభుత్వంలోని బడా నాయకుల పేర్లు చెప్పి కొనుగోళ్లకు చేశారు. దాదాపు ఏడాది, ఏడాదిన్నర వరకు అంటే ప్రభుత్వ భూసేకరణ ముగిసేవరకు ఇదే తంతు నడిచింది. ఇదంతా చూసిన జనం నిజమే చంద్రబాబు అమరావతి పేరుతో వారి నేతలకు, బినామీలకు లాభం చేకూర్చారని నమ్మారు. దానికి తోడు కుల రాజకీయం కూడ బలంగా పనిచేసింది. కేవలం ఒక సామాజిక వర్గం వారికే అమరావతిని దారాదత్తం చేశారని, అక్కడ ఉండేది, ఉండబోయేది ఒక కులానికి చెందిన జనమేనని వైఎస్ జగన్ తన పాదయాత్రలో గ్రామగ్రామానికీ తిరిగి మనిషి మనిషికీ చెప్పారు. దీంతో మిగతా వర్గాలు చంద్రబాబు మీద కోపం పెంచుకున్నాయి. ఫలితం ఆయన ఓటమి.
అవినీతే జరిగితే చంద్రబాబు మీద చర్యలేవి :
ఇలా బాబు మీద అవినీతి ముద్ర వేసేసి గెలిచిన జగన్ ప్రభుత్వం ఎర్పడగానే చెప్పిన మాట అమరావతి విషయంలో సమగ్ర విచారణ జరుపుతాం. అవినీతిపరులందరినీ జైలుకు పంపుతాం. ఎవ్వరినీ వదిలేది లేదు అంటూ ప్రతిజ్ఞ చేశారు. అవినీతి వెలికితీతకు మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించారు. ఆ ఉపసంఘం చకచకా విచారణ చేసి 4000 ఎకరాలకు పైగానే బినామీ పేర్లతో టీడీపీ నేతలు మింగేసినట్లుగా రిపోర్ట్ తయారుచేశాయి. వెంటనే సీఐడీ రంగప్రవేశం చేసింది. అదంతా చూసిన ప్రజలు వైఎస్ జగన్ ప్రభుత్వం, ఉపసంఘం కూడ అవినీతి జరిగిందని తేల్చింది. ఇక ఏముంది ఆధారాలు సంపాదించడం, అరెస్టులు చేయడం, భూములిచ్చిన అసలైన రైతులకు న్యాయం చేయడమే మిగిలుంది అనుకున్నారు. ఎవరెవరు అరెస్టవుతారో చూడాలని ఆసక్తిగా ఎదురుచూశారు.
కానీ వారి ఎదురుచూపులు అలాగే మిగిలిపోయాయి. ఇదిగో పలానా టీడీపీ లీడర్ ఇంత అవినీతి చేశాడు, తద్వారా ఇంత లబ్ది పొందాడు అనే వివరాలేవీ రాబట్టలేకపోయింది జగన్ సర్కార్. ఎక్కడా టీడీపీ కీలక నేతలు, చంద్రబాబు, లోకేష్ అవినీతి చేసినట్టు ఆధారాలు సంపాదించలేకపోయారు. దీంతో చంద్రబాబు బస్తీ మే సవాల్.. అవినీతి చేశాం అంటున్నారు కదా.. దమ్ముంటే ఆధారాలు చూపించి అరెస్ట్ చేయండి. ఎందుకు మౌనంగా ఉన్నారు. ఆధారాలు లేవు అంటే మేము అవినీతికి పాల్పడనట్టే లెక్క. మీరే మా మీద బురద చల్లి అధికారంలోకి వచ్చారు అంటూ జగన్ ను విమర్శిస్తున్నారు. వైఎస్ జగన్ ఏమో హడావుడిగా అమరావతిని కాదని మూడు రాజధానులను సిద్దం చేసే పనిలో నిమగ్నమయ్యారు. టీడీపీ నేతల ఆరెస్టులు జరుగుతున్నాయి కానీ అవి అమరావతి విషయంలో జరగట్లేదు. టీడీపీ లీడర్లు ఏమో అమరావతిని నాశనం చేయడానికే అబద్దమాడి ప్రజలను మోసం చేసి అధికారం పొందారని విమర్శిస్తున్నారు. ఈ పరిణామాలతో చంద్రబాబు వైపున అమరావతి సానుభూతి వర్గం ఒకటి తయారవుతోంది. జనం కూడ జగన్ చెబుతున్నట్టు చంద్రబాబు అవినీతిపరుడు కాదా అనే ఆలోచనలు పుడుతున్నాయి. ఇవన్నీ వైఎస్ జగన్ ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే పరిణామాలే.