ఆంధ్ర ప్రదేశ్ : రాష్ట్ర ప్రభుత్వం మీద టీడీపీ పార్టీ నుండి పలు అంశాలలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. టీడీపీ విసురుతున్న సవాళ్ళకి వైసీపీ ప్రభుత్వం రాజా మార్గంలో కాకుండా బూతు మార్గంలో సమాధానం ఇస్తుంది. మూడు రాజధానుల అంశానికి సంబంధించి టీడీపీ నేతలు కాస్త ఘాటుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. రాజకీయంగా ఏపీలో ఈ అంశం హాట్ టాపిక్ అయింది. మూడు రాజదానులకు నిజంగా ప్రజల్లో మద్దతు ఉంటే ప్రజల్లోకి వెళ్లి తేల్చుకుందాం అంటూ టీడీపీ నేతలు అనేక విధాలుగా సవాళ్లు చేస్తున్నా సరే అధికార పార్టీ నేతలు మాత్రం స్పందించకపోవడం ఇప్పుడు హాస్యాస్పదంగా ఉంది అని పలువురు అంటున్నారు.
అధికార ప్రభుత్వము మీద చంద్రబాబు చేసిన సవాల్ కి ప్రతి సమాధానంగా ఇద్దరు వైసీపీ మంత్రులు మీడియా ముందుకు వచ్చి బూతు పురాణం ఆలపించారు. అయితే తాజాగా టీడీపీ సీనియర్ నేత, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మీడియాతో మాట్లాడారు. 3 రాజధానులా, అమరావతి రాజధానా అనే రెఫరెండం పై రాజీనామాకు నేను సిద్ధం అని ఆయన సవాల్ చేశారు. కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలు ఇందుకు సిద్ధమా అని ఆయన సవాల్ విసిరారు. నోరు శుద్ధి లేని మంత్రులు ఇష్టానుసారo మాట్లాడటం కాదు అని ఆయన అభిప్రాయపడ్డారు. ధైర్యముంటే రాజీనామా చేసి ప్రజా క్షేత్రంలో తేల్చుకునేందుకు రండి అని ఆయన సవాల్ విసిరారు.
ప్రజల తీర్పు 3 రాజధానులకు అనుకూలంగా ఉంటే చంద్రబాబుతో పాటు నేను రాజకీయ సన్యాసం చేస్తా అని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా నిన్న చంద్రబాబు అమరావతిలో సవాల్ చేస్తే వైసీపీ నుంచి కొడాలి నానీ మీడియా ముందుకు వచ్చి నోటికి పని చెప్పారు. సవాల్ చేయటం.. పారిపోవటం వైసీపీ నేతలకి సాధారణ విషయం అయిపోయిందని టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు. సవాళ్లు చేసి పారిపోవటమే కాకుండా… అవినీతి ఆరోపణలు చేయటం, నిరూపించమని అడిగితే పత్తా లేకుండా పోతారని టిడిపి నాయకులు ఎద్దేవా చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి దాదాపు రెండు సంవత్సరాలైనా ఇప్పటివరకు ఒక్క అవినీతి ఆరోపణ మీద రుజువులు చూపించారా అని ప్రశ్నించారు.గద్దె సవాల్ ని స్వీకరించే దమ్ము ఉందా అని టిడిపి నాయకులు అడుగుతున్నారు.