వైసీపీ నాయకులు పచ్చి మోసగాళ్ళని, కాబట్టే ప్రజలు వారిని కేవలం 11 సీట్లకే పరిమితం చేశారని టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అమరావతి, విజయవాడపై పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేస్తే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు.
పేర్ని నాని, ఆయన భార్య పేరు మీద బియ్యం నొక్కేసారని బుద్ధా వెంకన్న ఆరోపించారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేవాలయాల భూమిని ఆక్రమించుకొని దోపిడీ చేశారని మండిపడ్డారు. ఈ విషయంపై పేర్ని నాని ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు.
విజయవాడ ఉత్సవాల కోసం గొల్లపూడిలో స్థలం లీజుకు తీసుకున్నామని, ఇది అందరికీ తెలిసిన విషయమేనని బుద్ధా వెంకన్న స్పష్టం చేశారు. ఈ ఉత్సవాలను చెడగొట్టేందుకు దేవినేని అవినాష్, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్ కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
వెల్లంపల్లి శ్రీనివాస్ను ఎద్దేవా చేస్తూ ‘నీ మూడు సింహాలు ఎక్కడ?.. నీ జాతకం రెడ్ బుక్లో రాసి ఉంది’ అని బుద్ధా వెంకన్న విమర్శించారు. దేవినేని అవినాష్ కబ్జాల జాతకం అందరికీ తెలిసిన విషయమేనని ఆయన వ్యాఖ్యానించారు.
రాజకీయాలను అడ్డం పెట్టుకొని పేర్ని నాని దోచుకున్నారని, పార్టీ నేతలతో కలిసి ఉత్సవాలపై విషం చిమ్ముతున్నారని బుద్ధా వెంకన్న మండిపడ్డారు. అమరావతి రాజధానిపై వైసీపీ నేతలు రోజుకో మాట మాట్లాడుతున్నారని ఆయన ఫైర్ అయ్యారు. ఇకపై 30 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుందని జోస్యం చెప్పారు. అమరావతి, విజయవాడపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు ఊరుకోరని వైసీపీ నేతలను బుద్ధా వెంకన్న హెచ్చరించారు.


