ఆంధ్ర ప్రదేశ్: బీజేపీ నేతల వ్యవహారం చూస్తుంటే తిరుపతి ఎన్నకని గెలవటానికి ఏమైనా చేయటానికి సిద్ధమన్నట్లుగా అనిపిస్తుంది. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర లను వదిలేసి కేవలం సీమ జపం చేస్తూ ఇక్కడ భారీ ఎత్తున అభివృద్ధి చేస్తామని, ప్రాజెక్టు లు తీసుకువస్తామని చెప్పడంతోపాటు కర్నూలులో ఒకఅసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కూడా సోము వీర్రాజు చెబుతున్నారు. అయితే ఈ పరిణామాలు బీజేపీకి కలిసివస్తాయా? అనేది ప్రశ్నగా మారింది.ఒకరకంగా చూసుకుంటే నాయక బలం బీజేపీకి ఉన్నా కేవలం సీమనే వాయిస్ చేసుకోవడం వల్ల మిగిలిన ప్రాంతాల్లో పరిస్థితి ఏంటనేది చూడాలి.
సీమలో ప్రాజెక్టులు కడతాం 20 వేల కోట్లను కేటాయిస్తాం,తిరుపతిని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని చెబుతున్న సోము వీటిని ఎలా చేస్తారో మాత్రం వివరించలేక పోతున్నారు.అప్పుడెప్పుడో తిరుపతి పార్లమెంటులో ఒకసారి గెలిచిన తర్వాత మళ్లీ సీమలో బీజేపీ గళం వినిపించిన నాయకుడు కనుచూపు మేరలో కనిపించలేదు.తిరుపతిలో ప్రధాన పార్టీగా ఉన్న టీడీపీ పరిస్థితినే అగమ్యగోచరంగా ఉంది . మరి సంస్థాగతంగా, నాయకత్వ పరంగా కూడా బలంలేని బీజేపీ ఎలా సీమలో పాగా వేస్తుందో చూడాలి.
కేవలం ఒక్క ఎంపీ స్థానం కోసం మిగిలిన ప్రాంతాల అభివృద్ధిని విస్మరిస్తే మున్ముందు తాను పెట్టుకు న్న అధికారంలోకి రావడమనే లక్ష్యానికి బీటలు పడదా? అనే ప్రశ్న తెరమీదికి వస్తోంది.ఉత్తరాంధ్ర వెనుకబడి ఉంది రాజధాని సమస్య అలానే ఉంది.ప్రత్యేక హోదా కోసం అన్ని ప్రాంతాల ప్రజల్లోనూ ఆశలు ఇంకా చిగిరించే ఉన్నాయి.ఇవన్నీ వదిలేసి ఉట్టి కెగరలేనమ్మ ఆకాశానికి ఎగిరినట్టుగా సీమలో బలపడతామని చెప్పడం సోము వీర్రాజు అతికి నిదర్శనంగా కాదా? అనేది విశ్లేషకుల ప్రశ్న.సోము వీర్రాజు తన వ్యూహంతో బీజేపీని ఏ గట్టుకి చేరుస్తారో చూద్దాం.