కేసీఆర్ నటనకు అస్కార్ అవార్డు ఇవ్వవచ్చని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. రావిరాలలో నిర్వహించిన రాజీవ్ రైతు రణభేరి బహిరంగ సభలో త్వరలోనే తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని అన్నారు. తన పాదయాత్రతో ఉప్పెన సృష్టిస్తానని.. ఉప్పెనలా కేసీఆర్ను కప్పేస్తానని రేవంత్ రెడ్డి చెప్పారు. కేసీఆర్, మోడీ ఇద్దరు తోడుదొంగల బరతం పట్టడానికే యాత్ర చేస్తానని చెప్పారు. కేసీఆర్ను గొయ్యి తీసి పాతిపెట్టడానికే తన పాదయాత్ర అని చెప్పారు.
కేసీఆర్… తాను కూడా రైతును అంటారని… అలాంటాయన వారికి ఎందుకు అండగా నిలవడం లేదని ప్రశ్నించారు. రైతు రుణమాఫీ చేయకపోవడంతో బ్యాంకులు రైతుబంధు పైసలు ఇవ్వడం లేదని అన్నారు. ఫసల్ బీమా కు స్టేట్ గవర్నమెంట్ మ్యాచింగ్ గ్రాంట్ కట్టకపోవడంతో రైతులు నిండా మునిగిపోయారని అన్నారు. పల్గు తాండలో 1800 ఎకరాల అసైన్డ్ భూమిని స్థానిక లంబాడీలు సాగు చేస్తున్నా పట్టాలు ఇవ్వడం లేదని..ఈ భూమిని కొందరు ఆక్రమించారని ఆరోపించారు. ఆ భూమిని తిరిగి ఇవ్వకపోతే వారి భరతం పడతానని హెచ్చరించారు.
ఫార్మాసిటీ పేరిట 20 వేల ఎకరాలను ప్రభుత్వం లాక్కుందని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. కోట్లాది రూపాయలు విలువ చేసే భూమిని .. క్రిమినల్ కేసులు పెట్టి స్వాధీనపరుచుకుందని విమర్శించారు. రైతుల వద్ద 8 నుంచి 16 లక్షలకు తీసుకొని… ప్రైవేట్ కంపెనీలకు రూ.1.25 కోట్లకు అమ్ముకుంటోందని మండిపడ్డారు. గజ్వేల్ లోని వెయ్యి ఎకరాల ఫాంహౌస్ ను ఎకరాకు 25 లక్షలు ఇస్తా .. ఫార్మా రైతులకు ఇవ్వండని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి.
కేసీఆర్ను తప్పులు చూపి మోడీ లొంగదీసుకున్నాడు. కానీ ప్రజల ఆత్మ గౌరవాన్ని కేసీఆర్ లొంగదీసుకోలేరు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి కేసీఆర్ యజమాని కాదు. అంబానీ, అదానిలకు రైతులను తెగనమ్ముతుంటే ఒక రైతు బిడ్డగా నేను ఎలా ఊరుకుంటా. రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎందుకు వెళ్లడం లేదనే గాడిదలకు అక్కడ ఏం జరుగుతుందో తెలియదా. మోడీ అఖండ భారత రైతుల గొంతు కొస్తున్నారు. పార్లమెంట్లో మంద బలంతో నల్ల చట్టాలు తెచ్చారు. ’’ అని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.