కేటిఆర్ కు రాఖీ కట్టి, కాళ్లు మొక్కి, గిఫ్ట్ ఇచ్చిన కవిత (వీడియో)

దేశమంతా రాఖీ సంబరాలు జోరుగా సాగుతున్నాయి. ఆడబిడ్డలంతా వారం రోజుల ముందు నుంచే రాఖీలు కొనిపెట్టుకుని ఇవాళ తోడబుట్టిన అన్నదమ్ములకు కడుతున్నారు. రాఖీ పండుగ అంటే ఆత్మీయతకు పెట్టింది పేరు అని పెద్దలు చెబుతుంటారు. ఏడాదిలో ఎప్పుడు పుట్టింటికి పోయినా పోకపోయినా రాఖీ పండుగనాడు కచ్చితంగా అమ్మగారింటికి పోతుంటారు ఆడపిల్లలు. పెళ్లిళ్లు అయి, ఎవరి బిజీ లైఫ్ లో వారు ఉన్నప్పటికీ రాఖీ మాత్రం అందరూ కలిసి ఆనందంగా జరుపుకునే పండుగ అని చెప్పొచ్చు.

తెలంగాణ సిఎం కేసిఆర్ కుమార్తె కవిత, కేసిఆర్ తనయుడు కల్వకుంట్ల తారక రామారావు ఇద్దరూ రాజకీయాల్లో ఉన్నారు. ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు. కవిత నిజామాబాద్ ఎంపిగా సేవలందిస్తున్నారు కేటి రామారావు ప్రస్తుతం రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి శాఖల మంత్రిగా ఉన్నారు.  అందరిలాగే ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఎంపి కవిత తన సోదరుడు కేటి రామారావుకు రాఖీ కట్టారు. ఈ ఏడాది కూడా గతంలో మాదిరిగానే రాఖీ కట్టి హెల్మెట్ బహుమతిగా ఇచ్చారు. అంతేకాదు రాఖీ కట్టిన వెంటనే కేటిఆర్ పాదాలకు మొక్కి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు కవిత. 

సిఎం కేసిఆర్ నివాసంలో జరిగిన ఈ వేడుకల్లో సిఎం పాల్గొనలేదు. ఎందుకంటే ఆయన ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. గత రెండు వారాల క్రితం సిఎం కేసిఆర్ సోదరి మరణించారు. దీంతో రాఖీ వేడుకలకు కేసిఆర్ మాత్రం దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

గత ఏడాదిలాగే ఈసారి కూడా ఎంపి కవిత తన సోదరుడికి రాఖీ కట్టడంతోపాటు హెల్మెట్ ను గిఫ్ట్ గా ఇచ్చారు. సిస్టర్ ఫర్ చేంజ్ అనే విప్లవాత్మకమైన కార్యక్రమాన్ని ఎంపి కవిత ప్రారంభించారు. తెలంగాణలోని అక్క చెల్లెల్లు అందరూ రాఖీ కట్టడమే కాకుండా అన్నదమ్ములకు గిఫ్ట్ గా హెల్మెట్ ఇవ్వాలని ఒక క్యాంపెయిన్ ప్రారంభించారు. గత ఏడాదిలాగే ఈ ఏడాది కూడా దాన్ని బాగా పాపులర్ చేశారు. ఆడబిడ్డలు రాఖీ కట్టడంతోపాటు హెల్మెట్ కూడా అన్నదమ్ములకు గిఫ్ట్ గా ఇస్తున్నారు. రహదారి ప్రమాదాల నివారణకు కవిత ఆరంభించిన ఈ కార్యక్రమం రెండేళ్లుగా సక్సెస్ ఫుల్ గా సాగుతోంది.

కేటిఆర్ కు రాకీ కట్టి, కాళ్లు మొక్కి, హెల్మెట్ బహుకరించిన వీడియో కింద ఉంది చూడొచ్చు. వీడియోలో కేటిఆర్ సతీమణి శైలిమ కూడా ఉన్నారు.