చంద్రబాబు వ్యూహం: వైసీపీ ఆ ఛాన్స్ మిస్సయ్యింది.!

చట్ట సభలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాగ్యుద్ధం అనేది ఇప్పుడు కొత్తగా జరుగుతున్నదేమీ కాదు. గతంలో పరిస్థితుల కంటే, ఇప్పుడు ఇంకాస్త దిగజారిపోయాయ్ అంతే. స్థానిక ఎన్నికల్లో ఓటమి, అందునా సొంత నియోజకవర్గం కుప్పంలో జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో టీడీపీ ఓటమిని టీడీపీ అధినేత జీర్ణించుకోలేకపోతున్నారు.. సరిగ్గా ఆ సమయంలోనే అసెంబ్లీ సమావేశాలు షురూ అయ్యాయి.

మామూలుగా అయితే, ఇది అధికార పార్టీకి బోల్డంత అడ్వాంటేజ్. అసెంబ్లీ సమావేశాలు జరిగినన్నాళ్ళూ ప్రతిపక్షాన్ని తూలనాడేందుకు ఓ అద్భుతమైన అవకాశం వైసీపీకి దొరికినట్లే. అందుకేనేమో, సుదీర్ఘ రాజకీయ అనుభవం తన సొంతం కావడంతో, చంద్రబాబు అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ‘ఏడుపు’ డ్రామాకి తెరలేపారు.. అసెంబ్లీ సమావేశాల్ని బహిష్కరించేశారు.

చంద్రబాబు ఎప్పుడైతే అసెంబ్లీ సమావేశాల్ని బహిష్కరించేశారో, అధికార వైసీపీకి.. చట్ట సభల్లో మాట్లాడేందుకు సరైన టాపిక్ లేకుండా పోయింది. చప్పగా సాగుతున్నాయి అసెంబ్లీ సమావేశాలు ప్రతిపక్షం లేకపోవడంతో. గతంలో వైసీపీ ప్రతిపక్షంగా వున్నప్పుడూ ఇదే పరిస్థితి. వైసీపీ అసెంబ్లీ సమావేశాల్ని బహిష్కరించడంతో, టీడీపీ మాత్రమే సభలో వుండి మమ అనిపించేయాల్సి వచ్చింది.

నిజానికి, వైసీపీ వ్యూహాల్లో వైఫల్యం కనిపిస్తోంది. ప్రతిపక్షాన్ని మాట్లాడనిచ్చి.. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నన్ని రోజులూ.. సమయానుకూలం పొలిటికల్ సెటైర్లు వేసి వుండాలి. కానీ, అలా జరగలేదు. బహుశా, చంద్రబాబు వ్యూహమే బాగా వర్కవుట్ అయ్యిందని అనుకోవాలేమో.