Leaders : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇకపై రాజకీయ నాయకులు వ్యక్తిగత దూషణలకు దిగరట. బూతులు తిట్టుకోరట. అలాగని, ఇద్దరు నేతలు మీడియా సాక్షిగా వ్యాఖ్యానించారు. కానీ, వారిని నమ్మేదెలా.? అసలు వారితో తిట్లు తిట్టించకపోతే తెలుగు మీడియా మనుగడ సాధించేదెలా.?
‘మిమ్మల్ని ఆయన అలా అన్నాడు.. దీనిపై మీ స్పందనేంటి.?’ అంటూ మీడియా మైకులు నాయకుల ముందరకు వెళుతుండడంతో, ‘ఆడు తిట్టాడు కాబట్టి, నేను తిట్టకపోతే బాగోదు..’ అన్నట్టుగా మరింత దిగజారుడు వ్యాఖ్యలతో విరుచుకుపడుతున్నారు నాయకులు ఒకర్ని మించి ఇంకొకరు.
ఇదేదో ఇప్పుటు కొత్తగా తెరపైకొచ్చిన వ్యవహారం కాదు. కాకపోతే, ఈ మధ్య పరిస్థితి మరింత దిగజారిపోయిందంతే. తాజా బూతుల పర్వం మంత్రి కొడాలి నానికీ, టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నకీ మధ్య నడుస్తోంది. అయితే, ఓ ఛానల్ చర్చా కార్యక్రమంలో ఇరువురూ, ‘ఇకపై వ్యక్తిగత దూషణలకు వెళ్ళం.. రాజకీయ విమర్శలు మాత్రమే చేసుకుంటాం..’ అని చెప్పారు.
కానీ, అటు మంత్రి కొడాలి నాని కావొచ్చు, ఇటు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కావొచ్చు.. తిట్ల పర్వానికి శాశ్వతంగా ముగింపు పలికేస్తారని అనుకోలేం. అలా బూతులు మాట్లాడకపోతే, తిట్ల దండకం ఎత్తుకోకపోతే వాళ్ళకి రాజకీయంగా భవిష్యత్తు లేదన్న భావన ఆయా పార్టీల్లో బలపడిపోయింది మరి.
మంత్రిగా కొడాలి నాని తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏమైనా తెచ్చుకున్నారా.? అంటే, అది కేవలం ఈ తిట్ల దండకం వల్లనే. బుద్ధా వెంకన్న సంగతి సరే సరి. వీళ్ళ సంగతేమోగానీ, మీడియాకి తెల్లారదు నేతలు బూతులు తిట్టుకోకపోతే. ఆ స్థాయికి మీడియా, రాజకీయం దిగజారిపోయాయ్.
‘s