కరోనా మహమ్మారి థర్డ్ వేవ్ లో పిల్లలపై విరుచుకుపడుతుందన్న నిపుణుల అంచనాలు నిజమయ్యేలా కనిపిస్తుంది. ఇప్పటికే దేశంలో అనేక ప్రాంతాలలో పిల్లలు కరోనా వైరస్ భారిన పడుతున్నారని తెలుస్తుంది. దీంతో పిల్లల తల్లిదండ్రులు కలవరపడుతున్నారు. అంతేకాకుండా కాలానుగుణంగా మనుషలపై కొన్ని రోగకారక వైరస్లు దాడిచేస్తుంటాయి. మరి ముఖ్యంగా చిన్నపిల్లలపై వీటి ప్రభావం కొంచెం ఎక్కువగా ఉండి ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. కాబట్టి పిల్లల్ని అన్ని రకాల వైరస్ ల నుండి కాపాడుకోవాలంటే వారికి రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని అందివ్వాలి.
డ్రైఫ్రూట్స్ లో విటమిన్స్, మినరల్స్, ఫైబర్ లాంటివి అధిక మోతాదులో ఉండటంతో ఇవి ఇమ్యూనిటీని బాగా పెంచుతాయి. బాదం పప్పు, జీడిపప్పు, అంజీర వంట వాటిని ప్రతి రోజు పిల్లలకు ఇవ్వండి. సాధారణంగా చాలామంది పిల్లలు డ్రైఫ్రూట్స్ తినేందుకు విముఖత వ్యక్తపరుస్తారు. ఇలాంటి వారికి డ్రైఫ్రూట్స్ తో సలాడ్స్ లా చేసి ఇవ్వొచ్చు. లేదంటే డ్రైఫ్రూట్స్ ను పొడిగా చేసి పాలల్లో, ఇతర వంటకాలలో మిక్స్ చేసి అందించవచ్చు.
కూరగాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్లు రాకుండా చూస్తాయి. వాపులను తగ్గిస్తాయి. దీంతో వ్యాధులు రాకుండా కాపాడటమేగాక శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. పాలకూర, తోటకూర, బ్రోకలీ, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు, క్యారెట్స్ తదితర కూరగాయలను ఎక్కువగా పిల్లలకు ఇవ్వడం వల్ల అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.
శరీరానికి కావాలసిన ఇమ్యూనిటీ పెంచే విషయంలో పండ్లను ప్రముఖంగా ప్రస్తావించుకోవాలి. పిల్లలకు యాపిల్, నారింజ, జామ పండ్లు ఇస్తే మంచిది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్లు రాకుండా చూస్తాయి. ఇవే కాకుండా కాలానుగుణంగా లభించే పండ్లను కూడా పిల్లలకు అందివ్వటం చాలా మంచిది.
ప్రోటీన్లు పుష్కలంగా లభించే వాటిలో పప్పు దినుసులు ముఖ్యమైనవి. ఇవి శరీర కణజాలానికి మరమ్మత్తులు చేస్తాయి. దీంతోపాటు శరీరానికి శక్తి లభిస్తుంది. ఈ క్రమంలో శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అందువల్ల పిల్లలకు నిత్యం పప్పు దినుసులు పెడితే మంచిది. కోడిగుడ్లు, పుట్టగొడుగులు, బెల్లం, రాగులు, నువ్వులు, పెరుగును పిల్లల ఆహారంలో ఉండేలా తల్లిదండ్రులు చూసుకుంటే వివిధ అనారోగ్యాల బారి నుండి వారిని రక్షించుకోవచ్చు.