మా పార్టీ ముఖ్య నేతలు బూత్ స్థాయిలోకి వెళ్ళి మరీ పార్టీ కోసం పనిచేస్తున్నారు.. ఎట్టి పరిస్థితుల్లోనూ తిరుపతిలో విజయం సాధించి తీరతాం..’ అని అంటున్నారు ఏపీ బీజేపీ నేతలు. మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత పురంధరీశ్వరి, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తదితరులు ఈ రోజు మీడియా ముందుకొచ్చారు.
పార్టీకి సంబంధించి తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక కోసం ప్రత్యేకంగా కమిటీలు వేసుకున్న వైనం గురించి వివరించారు. ఇప్పటికిప్పుడు ఈక్వేషన్స్ ప్రకారం చూసుకున్నా నెంబర్ వన్ పొజిషన్ బీజేపీదేనన్నది ఏపీ బీజేపీ నేతలు చెబుతున్న మాట. నిజమేనా.? అసలు బీజేపీ అభ్యర్థి ఎవరు.? అన్న ప్రశ్నకు ఏపీ బీజేపీ నేతల వద్ద సమాధానమే లేదు. ‘అధిష్టానం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి వుంది.. సరైన సమయంలో అభ్యర్థిని ప్రకటిస్తాం..’ అని పురంధరీశ్వరి సహా బీజేపీ నేతలంతా చెబుతున్నారు. ఇంతకీ, జనసేన పార్టీతో చర్చలు జరుగుతున్నయా.? అనడిగితే, అన్ని విషయాలనీ మిత్ర పక్షం జనసేనకు చేరవేస్తున్నామనీ, తిరుపతి ఉప ఎన్నికలో జనసేన మాకు పూర్తి మద్దతివ్వడమే కాదు, మా గెలుపుకు సహకరిస్తుంది.. అని చెబుతున్నారు బీజేపీ నేతలు. అయితే, జనసేన పూర్తిగా తిరుపతి ఉప ఎన్నిక విషయమై సైలెంటయిపోయింది.
బీజేపీ నుంచి ప్రతిపాదనలు వస్తే, అప్పుడు ఆలోచించొచ్చు.. అన్న భావనలో జనసేన వున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బీజేపీ – జనసేన మధ్య చిన్నపాటి చిచ్చు రేగింది. అంతకు ముందు గ్రేటర్ ఎన్నికల సమయంలోనే నిప్పు రాజుకుంది. సరిగ్గా తిరుపతి ఉప ఎన్నిక వేళ బీజేపీకి షాకివ్వాలనే ఆలోచనతో జనసేన వుందనే ప్రచారం జరుగుతోంది. వైసీపీని ఘాటుగా విమర్శించనప్పుడు.. మిత్రపక్షమే అయినా బీజేపీకి తామెందుకు సహకరించాలి.? అన్న ధోరణలో బీజేపీ వున్నట్లు కనిపిస్తోంది. ఏదిఏమైనా, తిరుపతి ఉప ఎన్నిక కోసం కొన్ని నెలల ముందు నుంచే హంగామా మొదలు పెట్టిన బీజేపీ, అభ్యర్థి ఎవరో ఇంకా ఖరారు చేయకపోవడం శోచనీయం.