ఎప్పుడో ఒకసారి పూనకం వచ్చినట్టు ఊగిపోయి మిగతా సమయాల్లో మౌనంగా ఉండిపోతారనే విమర్శ పవన్ కళ్యాణ్ మీద ఉంది. ఆ విమర్శను పట్టుకునే ఆయనకు పార్ట్ టైమ్ పొలిటీషియన్ అనే ట్యాగ్ తగిలించారు రాజకీయ ప్రత్యర్థులు. ఒక్కోసారి పవన్ వైఖరి చూస్తే అలాగే అనిపిస్తుంది. ఎక్కువ సమయాన్ని ఆలోచించడానికి, తక్కువ సమయాన్ని ఆచరణకు వాడుతున్నట్టు కనిపిస్తారు. గత ఎన్నికల్లో ఆయన ఓటమిలో ఈ డ్రాబ్యాక్ ప్రభావం కూడ ఉంది. అందుకే ఆయన్ను నిత్యం ప్రజలకు కనిపిస్తూ, వినిపిస్తూ ఉండమని కోరుతుంటారు ఆయన కార్యకర్తలు, అభిమానులు.
లాక్ డౌన్ పడటం, సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి నాలుగైదు సినిమాలకు సైన్ చేయడంతో రాజకీయాల్లో ఆయన ప్రజెన్స్ ఇదివరకటి కంటే తక్కువైంది. వాటికి తోడు బయాస్డ్ మీడియా ఆయన్ను దూరం పెట్టడం జనసేనకు మరో పెద్ద ప్రతికూల అంశం. టీవీల్లో, పేపర్లలో ఆయన పొలిటికల్ యాక్టివిటీస్ మీద కవరేజ్ చాలా చాలా తక్కువగా ఉంటోంది. ఈ సమస్య మొదటి నుంచీ జనసేన పార్టీని వేధిస్తూనే ఉంది. దీన్ని అధిగమించడానికి పవన్ , జనసేన శ్రేణులు సోషల్ మీడియానే నమ్ముకున్నాయి. గత ఎన్నికల్లో పార్టీ ప్రచారం పూర్తిగా సామాజిక మాధ్యమాల ద్వారానే చేసుకున్నారు.
అక్కడ కూడ వనరుల కొరత పార్టీని వేధించింది. అందుకే ఈ సమస్యకు చెక్ పెట్టడానికి ఈ లాక్ డౌన్ సమయాన్ని బాగా వాడుకున్నారు పవన్ . ఇక ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా అవసరం లేకుండా సోషల్ మీడియా వేదికను పటిష్టపరిచే ప్రణాళిక సిద్దం చేశారట సేనాని. తాజాగా పార్టీ నేతలు జనసేన పార్టీ బలోపేతం-దేశాభివృద్ధిలో సాంకేతిక పరిజ్ఞానం పాత్ర అనే అంశం మీద బెంగూరుకు చెందిన ఒక ఐటీ బృందంతో వెబినార్ నిర్వహించారట. ఇందులో పార్టీని జనంలోకి మరింత బలంగా తీసుకెళ్ళడానికి అవసరమైన అంశాలను చర్చించారట. వాటిలో పెద్ద ఎత్తున సోషల్ మీడియా సైన్యాన్ని నిర్మించుకోవాలనేది ప్రధాన అంశమట.
ఈమేరకు రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో పార్టీ కార్యాలయాలను నిర్మించి ప్రతి కార్యాలయంలో సోషల్ మీడియా ఇన్ ఛార్జును, బలమైన బృందాన్ని, కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటుచేసి పార్టీ కేంద్ర కార్యాలయం నుండి అవన్నీ పనిచేసేలా పెద్ద వ్యవస్థను రూపొందించాలని నిర్ణయించారట. కేవలం సోషల్ మీడియా మీద ఆధారపడి నడుస్తున్న జనసేనకు ఈ వ్యవస్థ ఏర్పాటు చాలా ఉపయోగపడుతుంది. మొత్తానికి లాక్ డౌన్ సమయంలో సైలెంట్గా ఉన్నాడనుకున్న పవన్ పెద్ద స్కెచ్చే వేశారన్నమాట.