ఆంధ్రప్రదేశ్ లో గత పది రోజుల వ్యవధిలో ఇద్దరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు హత్యకి గురయ్యారు. తాజాగా పలనాడులో ఒక రాజకీయ హత్య జరిగింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి మృతుడి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫ్యాక్షన్ నేత సీఎం అయితే రాష్ట్రం ఇలాగే ఉంటుంది అని ఆయన అన్నారు. అంకులు హత్యలో స్థానిక ఎస్ఐ బలనాగిరెడ్డి, ఎమ్మెల్యే కాసు భాగస్వామ్యం ఉంది అని ఆయన మండిపడ్డారు.
ఇప్పటికి నలుగురు కార్యకర్తలను ఈ ప్రాంతంలో హత్య చేశారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్ ఇన్స్పెక్టర్ పేరు ఎఫ్ఐఆర్ లో చేర్చాలి అని డిమాండ్ చేశారు. బడుగు బలహీన వర్గాల వ్యక్తులపై దాడులు జరుగుతున్నాయి అని అన్నారు. పులివేందులలో దళిత మహిళను కిరాతకంగా హత్య చేశారు అని ఆయన మండిపడ్డారు. గ్రామస్థులతో మీటింగ్ లో ఎమ్మెల్యే కాసు స్కెచ్ వేశారు అని ఆయన ఆరోపించారు. అంకులు ఫోన్ ఏమయ్యింది… ఎందుకు వాస్తవాలు చెప్పడం లేదు అని ఆయన నిలదీశారు. ఎస్ఐ పిలిస్తేనే అంకులు ఇంటి నుండి వెళ్లారు అని అన్నారు.
టిడిపి కార్యకర్తలని చంపితే భయపడిపోయేది లేదని అన్నారు. తెలుగుదేశం పార్టీని ఎదుర్కోలేక పార్టీ కార్యకర్తలను చంపుతున్న పిరికిపందలకు ఒకటే చెబుతున్నా. మీ ఫ్యాక్షన్ రాజకీయాలను ఇక్కడితో ఆపండి. లేదంటే జరగబోయే పరిణామాలకు జగన్ రెడ్డే బాధ్యత వహించాల్సి ఉంటుంది. మేము అధికారంలో ఉన్నప్పుడు ఇలా చేయాలనుకుంటే మీరెక్కడ ఉండేవారో ఆలోచించండి. కత్తిని నమ్ముకున్న వాడు అదే కత్తికి బలైపోతాడు అనే సత్యాన్ని జగన్ రెడ్డి త్వరగా గ్రహిస్తే మంచిదని లోకేష్ అన్నారు.