వైఎస్ జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదన తెస్తే, దానికి అనుకూలంగా మాజీ కేంద్ర మంత్రి, సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవి స్పందించడం అప్పట్లో జనసేన పార్టీకి తలనొప్పి తెచ్చిపెట్టింది. చిరంజీవి అభిమానులకీ, జనసైనికులకీ మధ్య పెద్ద రచ్చే నడిచింది సోషల్ మీడియాలో. తాజాగా కర్నూలు విమానాశ్రయానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్, స్వాతంత్రత్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెడితే, ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తూ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా స్పందించారు.. వైఎస్ జగన్ని అభినందించారు కూడా. దాంతో, సోషల్ మీడియాలో మళ్ళీ జనసైనికులకీ, చిరంజీవి అభిమానులకీ మధ్య మాటల తూటాలు పేలడం మొదలైంది.
ఈ మొత్తం వ్యవహారాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు వైసీపీ మద్దతుదారులు. నిజానికి, ఈ రచ్చకు కారణం టీడీపీ, బీజేపీ కావడం గమనార్హం. జనసైనికుల ముసుగులో, చిరంజీవి అభిమానుల ముసుగులో టీడీపీ, బీజేపీ అభిమానులే.. ఈ ‘మెగా చిచ్చు’కి ఆజ్యం పోస్తున్నారు. గతంలో కూడా ఇదే జరిగింది. అప్పట్లో చిరంజీవి, పవన్ కళ్యాణ్ అభిమానులు కాస్త తేరుకుని.. ‘చిరంజీవి ప్రస్తుతం రాజకీయాల్లో లేరు. ఆయన అభిప్రాయాలు వ్యక్తిగతం. ఆయనకు జనసేన పార్టీతో సంబంధం లేదు..’ అంటూ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
ఆ తర్వాత ఆ వివాదం సద్దుమణిగింది. ఇదిలా వుంటే, ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా ద్వారా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రను వెండితెరపై మెగాస్టార్ చిరంజీవి చూపించిన విషయం విదితమే. చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ఈ చిత్రానికి నిర్మాత. సురేందర్ రెడ్డి దర్శకుడు. అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, తమన్నా, నయనతార ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.