ఓటిటిలోకి వస్తున్న ‘మంజుమ్మల్‌ బాయ్స్‌’

మలయాళ చిత్రసీమలో సంచలనం సృష్టించిన చిత్రం ‘మంజుమ్మల్‌ బాయ్స్‌’ ఇటీవల విడుదలైన ఈ థ్రిల్లర్‌ తెలుగులోనూ మంచి టాక్‌ తెచ్చుకుంది. ఇప్పుడీ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయింది. డిస్నీ హాట్‌స్టార్‌ వేదికగా మే5 నుంచి స్టీమ్రింగ్‌ కానుంది. 2006లో జరిగిన వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకుని దర్శకుడు చిదంబరం ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సౌబిన్‌ షహిర్‌, గణపతి, ఖలీద్‌ రెహమాన్‌, శ్రీనాథ్‌భాసి, షా జార్జ్‌ మరియన్‌, లాల్‌ జూనియర్‌ కీలక పాత్రల్లో నటించారు. కేరళలోని కొచ్చికి చెందిన కుట్టన్‌ , స్ఘుభాష్‌ (శ్రీనాథ్‌)తో పాటు స్నేహితులందరూ సొంత ఊళ్లోనే చిన్నాచితకా ఉద్యోగాలు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు.

ఈ గ్యాంగ్‌కు ‘మంజుమ్మల్‌ బాయ్స్‌’ పేరుతో ఓ అసోసియేషన్‌ ఉంటుంది. వీరంతా కలిసి ఓసారి కొడైకెనాల్‌ టూర్‌కు వెళ్తారు. ఈ విహారయాత్రకు సుభాష్‌ మొదట రానని చెప్పినా కుట్టన్‌ బలవంతం విూద ఆఖరి నిమిషంలో కార్‌ ఎక్కుతాడు. మంజుమ్మల్‌ బ్యాచ్‌ కొడైకెనాల్‌లోని అందమైన ప్రదేశాలన్నీ చూశాక ఆఖరిలో గుణ కేవ్స్‌ చూడటానికి వెళ్తారు. ఆ గుహలు బయట నుంచి చూడటానికి ఎంత రమణీయంగా ఉంటాయో.. అంతే ప్రమాదకరం కూడా. ఎందుకంటే అక్కడ వందల అడుగుల లోతున్న ఎన్నో ప్రమాదకరమైన లోయలున్నాయి.

వాటిలో డెవిల్స్‌ కిచెన్‌ కూడా ఒకటి. దాదాపు 150 అడుగులకు పైగా లోతున్న ఆ లోయలో 13మందికి పైగా పడిపోయారు.. వీరిలో ఏ ఒక్కరూ ప్రాణాలతో తిరిగిరాలేదు. అందుకే గుణ కేవ్స్‌లోని ఆ ప్రమాదకర లోయలున్న ప్రాంతాలున్న చోటుకు వెళ్లడాన్ని అటవీశాఖ వారు.. పోలీసులు నిషేధించారు. కానీ, మంజుమ్మల్‌ బాయ్స్‌ అక్కడున్న అటవీ సిబ్బంది కళ్లుగప్పి.. ఫెన్సింగ్‌ దాటి గుణ కేవ్స్‌లోని ఆ ప్రమాదకరమైన ప్రదేశానికి వెళ్తారు. మరి ఆ తర్వాత ఏమైంది? ఆ లోయ నుంచి సుభాష్‌ను ప్రాణాలతో కాపాడి తీసుకురావడానికి తోటి స్నేహితులంతా ఏం చేశారు? అన్నది ఈ సినిమా ఇతివృత్తం.