
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నుంచి తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో ఓ ఆడియో టేప్ బయటకు వచ్చింది. ఈ ఆడియో టేప్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యింది. తిరుపతి ఉప ఎన్నిక ప్రచారం కోసం ఈ నెల 3న వెళ్ళిన పవన్ కళ్యాణ్, ఆ తర్వాత స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కరోనా అనుమానంతో, హోం ఐసోలేషన్ పాటించారు. తన వ్యక్తిగత భద్రతా సిబ్బంది, సహాయక సిబ్బంది కరోనా బారిన పడటంటో హోం క్వారంటైన్ నుంచి బయటకు రాలేదు పవన్. కరోనా టెస్ట్ చేయించుకున్నా, తొలుత నెగెటివ్ అనే వచ్చింది. తాజాగా కరోనా పాజిటివ్ అని తేలింది.
ఈ మధ్యలో ఎప్పుడన్నా ఆడియో టేప్ రికార్డ్ చేశారా.? అన్నవిషయాన్ని పక్కన పెడితే, ఆ ఆడియో టేపులో పవన్, తిరుపతి ఓటర్లకు కీలకమైన విజ్నప్తి చేశారు. తిరుపతి ఓటర్లు, జనసేన బలపరిచిన బీజేపీ అభ్యర్థి రత్నప్రభను గెలిపించాలని కోరారు. హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నా పట్టించుకోని ప్రభుత్వం.. అంటూ జగన్ సర్కారుపై విమర్శలు చేశారు. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశారంటూ పరోక్షంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విమర్శలు చేశారు.
తిరుపతి ఓటర్లు, బీజేపీకి ఓటెయ్యకపోతే, వెంకన్నకు ద్రోహం చేసినట్లేనని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కరవయ్యాయనీ, పోలీసు వ్యవస్థ.. ప్రభుత్వానికి భయపెడుతోందనీ, సామాన్యులకు న్యాయం చెయ్యలేకపోతోందని ఆరోపించారు పవన్ కళ్యాణ్. జనసేన బలపరిచిన బీజేపీ అభ్యర్థి సత్యప్రభ గెలిస్తేనే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందనీ, ఆమె గెలిస్తే.. రాష్ట్రానికి మేలు చేయడానికి తనవంతుగా ఆమె కష్టపడతారనీ జనసేన అధినేత చెప్పుకొచ్చారు. రేపు తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ జరగనుండగా, సరిగ్గా ఈ రోజే పవన్ కళ్యాణ్ కరోనా బారిన పడ్డారన్న ప్రకటన జనసేన నుంచి రావడం, అంతలోనే ఈ ఆడియో టేప్ వెలుగు చూడటం గమనార్హం.
