Vakiti Srihari Warns Pawan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రెండు రాష్ట్రాల ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్న ‘తలతిక్క మాటలు’ వెంటనే మానుకోవాలని, లేకపోతే తెలంగాణలో భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన ఘాటుగా హెచ్చరించారు.
అసలేం జరిగింది? గత వారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించిన పవన్ కల్యాణ్, సముద్రపు నీటి కోత వల్ల దెబ్బతిన్న కొబ్బరి తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ఇక్కడి పచ్చని కొబ్బరి చెట్లను చూసే ప్రత్యేక రాష్ట్ర (తెలంగాణ) డిమాండ్ వచ్చిందేమో” అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ దుమారానికి తెరలేపాయి.
మంత్రి శ్రీహరి కౌంటర్ పవన్ వ్యాఖ్యలపై మంత్రి శ్రీహరి స్పందిస్తూ, తెలంగాణ వనరులు వాడుకుని ఈ స్థాయికి ఎదిగిన పవన్.. ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం రెండు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టడం సరికాదని హితవు పలికారు. అన్నదమ్ముల్లా విడిపోయిన మనం కలిసుండాలని, పనితనంతో ప్రజల మెప్పు పొందాలే తప్ప అనవసర వ్యాఖ్యలతో కాదని సూచించారు.
వెంటనే తన వ్యాఖ్యలను పవన్ కల్యాణ్ వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని మంత్రి శ్రీహరి స్పష్టం చేశారు.


