తెలంగాణాలో టీఆర్ఎస్ పార్టీకి ఇక ఎదురు లేదు, తిరుగు లేదు,ఉన్న ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ లో కెసిఆర్ ని ఆపగలిగేవాడు లేరని అనుకుంటున్న తరుణంలో దుబ్బాక ఉప ఎన్నికలో పరాభవం రుచి చూయించి, వెంటనే గ్రేటర్ ఎన్నికలలో చావు దెబ్బ తీసి తెరాస ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది బీజేపీ పార్టీ. ఈ రెండు పార్టీల మధ్య ఉన్న దూకుడు రోజురోజుకు పెరుగుతూనే ఉంది. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల తర్వాత మాటల యుద్ధం ఇంకాస్త పెద్దదైంది. చివరకు వ్యక్తిగత దూషణల వరకు వెళ్లింది. మరోవైపు కేసీఆర్ జైలుకు వెళ్లటం ఖాయం అంటూ బీజేపీ గట్టిగానే జవాబిస్తుంది.
కేటీఆర్ అనుచరులుగా ముద్రపడ్డ వరంగల్ లో ఎమ్మెల్యేలు దాస్యం వినయభాస్కర్, బాల్క సుమన్ లు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై ఘాటుగా రియాక్ట్ అయ్యారు. దీంతో కేటీఆర్ కూడా అలాగే దూకుడు మీదుంటారు అని అంతా అనుకున్నారు. కానీ గ్రేటర్ పరిధిలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికలప్పుడే పంచాయితీ… ఎన్నికలు అయిపోయాయి, ఇక కలిసి సమిష్టిగా పనిచేసుకుందాం అంటూ బీజేపీకి స్నేహా హస్తాన్ని చాచారు. పోటీతత్వం మంచిదే అయినా… అనవసర పంచాయితీలు మన మధ్య వద్దని, ప్రజలు కూడా హర్షించరని వ్యాఖ్యానిస్తూ… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తేనే ప్రజలు స్వాగతిస్తారంటూ వ్యాఖ్యానించారు.దీంతో కేటీఆర్ రాజీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తూ… కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సాక్షిగా ఇక వైరం వద్దంటూ స్నేహా హస్తాన్ని చాచినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.