ఈగ ఆ ఊరికి చుక్కలు చూపిస్తుంది..

ఈగ చూస్తే చిన్నదే కానీ ఏమన్న ఇబ్బంది పెడుతదా… కూర్చోనివ్వదు.. నిలబడనివ్వదు. ఈగ సినిమాలో కూడా విలన్ ని ఈగ ముప్పు తిప్పలు పెడుతది. అలాంటి సంఘటనే ఒకటి ఉంది. ఆ ఈగలు ఊరు ఊరందరిని ముప్పు తిప్పలు పెడుతున్నాయి. తిందామన్నా పందామన్నా ఒక్కటే మోత. ఇంతకీ ఆ ఈగ అంతలా ఇబ్బంది పెడుతున్న ఊరేదో,, దాని కథేందో మీరూ చదవండి.

నల్లగొండ  జిల్లా చిట్యాల మండలం ఎలికట్టె గ్రామం. 2500 మంది జనాభా గ్రామంలో నివసిస్తున్నారు. వ్యవసాయమే ఆధారంగా ఈ గ్రామంలో అధిక మంది జీవనోపాధిగా బతుకుతున్నారు. ప్రశాంతంగా ఉన్న ఊరిలో 2015లో శ్రీలక్ష్మీ ఎంటర్ ప్రైజెస్ వారు 70 ఎకరాలలో కోళ్లఫారాలను నిర్మించారు. నందిగామకు చెందిన వెంకట్ నారాయణ దీని యజమాని. అభివృద్దికి ఆమడ దూరంలో విసిరేసినట్టుగా ఉండే ఎలికట్టె గ్రామంలో కోళ్ల ఫారంతోనైనా అభివృద్ది జరుగుతుందని గ్రామస్థులంతా సంతోషించారు. ఉపాధి లభిస్తుందనుకున్నారు. కానీ వారి ఆశలు అడియాసలయ్యాయి. కోళ్ల ఫాం ప్రారంభించిన కొన్ని రోజుల్లోనే దాని వ్యర్థాల నుంచి ఈగలు, క్రిమికీటకాలు రావడం ప్రారంభమైంది.

ఇంట్లో అన్నంపై వాలిన ఈగలు

రెండు నెలల కాలంలోనే గ్రామమంతా ఈగలు వ్యాపించాయి. ఎక్కడ చూసినా ఈగలే.. తిందామనుకున్నా కూడా నోటి దగ్గర అన్నం ముద్ద బదులు ఈగల కుప్ప ఉండేది. అంతలా ఈగలు గ్రామానికి వ్యాపించాయి. ఈగల ద్వారా రోగాలు వచ్చి అనేక మంది మంచం బాట పట్టారు. చిన్నాపెద్ద, ముసలి అనే తేడా లేకుండా అంతా రోగాలతో దవఖానాల పాలయ్యారు. దీనిపై గ్రామస్థులంతా ఉద్యమించారు. అధికారులను రాజకీయ నాయకులను కలిసినా వారి సమస్య పరిష్కారం కాలేదు. కలెక్టరేట్ ల చుట్టూ, రాజకీయ నాయకుల చుట్టూ తిరిగినా చూద్దాం,, చేద్దాం అన్నారే కానీ సమస్య పరిష్కరించలేదని గ్రామస్థులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.

గ్రామస్థుల పోరాటంతో దిగొచ్చిన కోళ్ల ఫాం యజమాని గ్రామమంతా పిచికారీ మందు కొట్టించి తాత్కాలిక ఉపశమనం చూపాడు. అది రెండు రోజులకే పరిమితమైంది. ఆ తర్వాత మళ్లీ ఈగల మోత ప్రారంభమయిందని గ్రామస్థులు తెలుపుతోన్నారు. శాశ్వత పరిష్కారం కావాలంటే కోళ్ల ఫారాల షెడ్డును గ్రామం నుంచి తీసివేయాలని వారు కోరుతున్నారు.

[videopress JZASw9lZ]

కోళ్ల ఫాంను తొలగించాలని గ్రామస్థులు కంపెనీ ముందు ఆందోళన  చేస్తున్న దృశ్యాలు

కోళ్ల ఫారాల యజమానితో గ్రామానికి చెందిన కొంతమంది నేతలు లాలూచీ పడి డబ్బులు తీసుకున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. అధికారులు కూడా కుమ్మకయ్యారని వారు విమర్శిస్తున్నారు. మంత్రి ఈటెల రాజేందర్ అండదండలతోనే కోళ్ల ఫాం యజమాని ఈ విధంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.  రెండేళ్ల నుంచి పోరాడుతున్న మా సమస్య పరిష్కారం కాకపోవటానికి మంత్రే కారణమని, ఈటెల రాజేందర్ కు కోళ్ల ఫాం యజమానికి దగ్గర సంబంధాలున్నాయని గ్రామానికి చెందిన యువకులు ఆరోపణలు చేస్తున్నారు. గ్రామం నుంచి కోళ్ల ఫారాల షెడ్డును తీసేస్తేనే ఊరు బాగుపడుతుందని లేకపోతే ఊరంతా ఆగమైతదని గ్రామస్థులు వాపోతున్నారు. వాన కాలం వస్తున్న వేళ ఈగల బెడద మళ్లీ ఎక్కువైందని. వారం రోజుల్లోగా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని లేని పక్షంలో గ్రామస్థులమంతా కలిసి కట్టుగా ఉద్యమిస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ఈగల బెడదపై యాజమాన్యం, ప్రభుత్వంపై పేడో తేల్చుకునేందుకు సిద్దమవుతామని గ్రామ యువకులు  అంటున్నారు.

[videopress sVsPVRlJ]

గ్రామ సర్పంచ్ తో గ్రామస్థుల వాగ్వాదం