పంచాయతీ ఎన్నికలను సక్రమంగా నిర్వహించడంలో ఎన్నికల కమిషన్ విఫలమయిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై మండిపడ్డారు. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ చంద్రబాబు కోసమే గతంలో ఎన్నికలు వాయిదా వేశారని.. ఇప్పుడు కూడా టీడీపీ కోసమే కరోనా ఉన్నా ఎన్నికలు పెడుతున్నారని వైసీపీ నాయకులు ఆరోపించారు.. ఇంకా ఆరోపిస్తూనే ఉంటారు కూడా. అయితే అనూహ్యంగా ఇప్పుడు చంద్రబాబు నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పై నిప్పులు చెరిగారు.
చిత్తూరు జిల్లాలో పుంగనూరు, రొంపిచర్ల, సోమల, చౌడేపల్లి తదితర ప్రాంతాల్లో నామినేషన్లు పెద్దఎత్తున తిరస్కరణకు గురయ్యాయని చంద్రబాబు అంటున్నారు. అడ్డగోలుగా నామినేషన్లు తిరస్కరించి ఏకగ్రీవాలు చేసుకున్నారని.. తమ అభ్యర్థులకు రక్షణ కావాలని ఎస్ఈసీని కోరినా ఫలితం లేకుండా పోయిందని చంద్రబాబు అంటున్నారు. ఎస్ఈసీ విఫలమవడం వల్లే హైకోర్టును ఆశ్రయించామని చెబుతున్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎస్ఈసీదే బాధ్యతలని.. ఎన్నికల సజావుగా నిర్వహించడంలో ఎస్ఈసీ పూర్తిగా విఫలం అయ్యారని చంద్రబాబు నిప్పులు చెరిగారు. మూడు నియోజకవర్గాల్లో మళ్లీ ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ఎస్ఈసీపై ఉందని అన్నారు.
ఎన్నికల కమిషన్ తన అధికారాలను పూర్తిగా వినియోగించలేదని చంద్రబాబు అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన టీడీపీ వారిపైనే కేసులు పెడుతున్నారన్నారు. ఎన్ని మార్లు ఎస్ఈసీకి ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని చంద్రబాబు అన్నారు. దీనిపై రాష్ట్రపతి, కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేయనున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకూ ఎన్నికల కమిషనర్ బాధ్యత వహించాలని చంద్రబాబు తెలిపారు. ఇన్నాళ్లు చంద్రబాబు తోలుబొమ్మ అని విమర్శలెదుర్కొన్న నిమ్మగడ్డ ఇప్పుడు అదే బాబుతో తిట్లు తినటం చూస్తుంటే పాపం అనిపిస్తుంది.