అమరావతిలో పాలన రాజధాని, న్యాయ రాజధాని ఉండదని, అవి విశాఖ, కర్నూలు జిల్లాలకు తరలిపోతాయని జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమరావతి రైతుల్లో గుబులు పుట్టించిన సంగతి తెలిసిందే. శాసన రాజధానితో ఆశించిన అభివృద్ది సాధ్యం కాదని, ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతే పూర్తిస్థాయి రాజధానిగా ఉండాలని భూములిచ్చిన రైతులు పట్టుబట్టారు. నెలల తరబడి దీక్షలు చేస్తున్నారు. ఈలోపు ప్రభుత్వం తరలింపు చర్యలు మొదలుపెట్టడంతో కోర్టులో పిటిషన్లు వేశారు. దీంతో హైకోర్టు తరలింపు మీద స్టేటస్ కో విధించింది. దీంతో రాజధాని తరలింపు ఆగిపోయింది. అంతేకాదు అమరావతిలో ఇతర ప్రాంతాల పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం మీద కూడ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
దీంతో జగన్ బృందంలో అసహనం నెలకొంది. ప్రతిష్టాత్మకంగా భావించిన రెండు పనులు ఆగిపోవడంతో వైసీపీ రగిలిపోతోంది. రైతులు, ప్రభుత్వం మధ్య హోరాహోరీ పోరాటం వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో మంత్రి కొడాలి నాని అసలు అమరావతిలో శాసన రాజధాని కూడ ఉండకూడదని అనడం కలకలం రేపింది. తాజాగా కూడ మంత్రి నాని అమరావతి భూములను ఇళ్ల పట్టాలుగా ఇవ్వనీయకుండా కొర్టుకెళ్లారు. అలాంటప్పుడు అక్కడ శాసన రాజధాని కూడ ఉండాల్సిన అవసరం లేదని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రికి తెలుపగా ఆయన మిగతా నేతలతో కూడ మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని అన్నారని అధికారికంగా తెలిపారు.
ఈ పరిణామంతో అమరావతిలో శాసన రాజధాని ఉండదని, ఇక అమరావతికి రాజధాని అనే హోదానే ఉండబోదని రూఢీ అయిపోయింది. దశలవారీగా ప్రభుత్వం అమరావతిని నిర్వీర్యం చేస్తూ వచ్చి చివరకు పూర్తిస్థాయిలో పక్కనపడేయాలనే మనసులో మాటను మంత్రి నాని ద్వారా బయటపెట్టించిందని రైతులు అంటున్నారు. కొడాలి నాని మాటలు వింటే మేము అనుకున్నట్టు అక్కడ భూములు పంచనివ్వలేదు. అలాంటప్పుడు మీరు డిమాండ్ చేస్తున్నట్టు అక్కడ రాజధానిని ఎందుకు ఉంచాలి. తీసేస్తాం అంటూ బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నట్టే ఉంది. మరి అభివృద్ది కేంద్రీకరణ గురించి లెక్చర్లు దంచుతున్న వైసీపీ నేతలు కనీసం శాసన రాజధాని కూడ లేని అమరావతిని ఏ రీతిన డెవలప్ చేస్తారు, రైతులకు ఎలా న్యాయం చేస్తారో కూడ చెబితే బాగుంటుంది.