విశ్లేషణ: ఏపీలో ఏ వర్గం ఓటు ఎటువైపు పడనుంది?

(శ్రవణ్ బాబు)

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈసారి త్రిముఖ పోటీ నెలకొని ఉంది. టీడీపీ, వైసీపీల స్థాయిలో లేకపోయినా జనసేనపార్టీ చాలాచోట్ల నిర్ణయాత్మకంగా ఉంది. పోయినసారి ముఖాముఖి పోటీలో టీడీపీ విజయం సాధించింది. మరి ఈ త్రిముఖ పోటీ ఎవరికి లాభిస్తుందో పరిశీలిద్దాం.

ఏపీలో కులాల స్పృహ కాస్త ఎక్కువేనన్న విషయం తెలిసిందే. అందులోనూ ఈ సారి పోటీ తీవ్రంగా ఉండటంతో ఈ ఎన్నికలు మూడు కులాలకు చెందిన మూడు ప్రధానపార్టీల మధ్య యుద్ధంలాగా మారాయి. ఇక రాష్ట్రంలో మిగిలిన కులాల ఓటర్లు ఈ మూడు పార్టీలలో ఎవరికి అత్యధికంగా మొగ్గు చూపితే వారే అధికారాన్ని చేజిక్కించుకుంటారన్నది ప్రత్యేకంగా చెప్పనవరసరంలేదు.

తెలుగుదేశం

తెలుగుదేశం పార్టీ కమ్మ సామాజికవర్గానిది అన్న సంగతి తెలిసిందే. మొదటినుంచి కమ్మ కాకుండా, గౌడ, యాదవ, పద్మశాలి వంటి బీసీలుకూడా ఆ పార్టీకి ప్రధాన ఓట్ బ్యాంక్ గా ఉండేవారు. కానీ ఇటీవలి కాలంలో బీసీలు గతంలో ఉన్నంతగా టీడీపీవైపు మొగ్గు చూపటంలేదు. పద్మశాలి వర్గం ఒక్కటే ఇంకా టీడీపీవైపు ఉంది. గౌడ, యాదవ కులాలలో టీడీపీ పట్ల అభిమానం తగ్గుతూ వస్తోంది. మరోవైపు నాయీ బ్రాహ్మణ ప్రతినిధులను ఇటీవల చంద్రబాబు తూలనాడటంతో వారు ఆగ్రహంతో ఉన్నారు. ఇక టీడీపీకి అనుకూలించే వర్గాలను పరిశీలిస్తే – 2014లో తెలుగుదేశానికి జనసేన ఓట్లు, బీజేపీ ఓట్లు తోడవటంతో 46.3 శాతం నమోదయింది. టీడీపీకి, వైసీపీకి ఓట్లశాతంలో తేడా 2 కంటే తక్కు శాతం మాత్రమే. కానీ 2019లో జనసేన, బీజేపీ టీడీపీకి దూరమై విడిగా పోటీ చేస్తున్నాయి. అంటే 48.2 శాతం ఓట్లలో గణనీయంగానే గండి పడనుంది… ముఖ్యంగా నాడు టీడీపీకి వేసిన కాపు ఓటర్లు ఇప్పుడు ఆ పార్టీ అంటేనే మండిపడుతున్నారు. వారి కులపెద్ద, నిజాయితీపరుడు అయిన ముద్రగడను ప్రభుత్వం ఒక తీవ్రవాదిని చూసినట్లు చూసి వేధించటంతో కాపులంతా తీవ్ర అసంతృప్తికి గురయ్యారు.

మరి నాటికీ, నేటికీ టీడీపీకి ప్లస్ అయ్యేదేమైనా ఉందా అంటే, ఒక్కటే సమాధానం వస్తుంది. చంద్రబాబునాయుడుకూడా దానినే తారకమంత్రంగా భావిస్తున్నారు. అదే సంక్షేమ పథకాల మంత్రం. ఏపీ ఓటర్లపై సంక్షేమ పథకాల సమ్మోహనాస్త్రాన్ని ఆయన ప్రయోగించారు. పెన్షన్లు, పసుపు-కుంకుమ, అన్నదాతా సుఖీభవ వంటి ఆకర్షణీయమైన పథకాల వానలో ఓటర్లను తడిపి ముద్దచేసేస్తున్నారు. మరి ఈ పథకాల లబ్దిదారులు పూర్తిగా టీడీపీకి ఓట్లు వేస్తారా అంటే అత్యధిక శాతం వేయటానికే అవకాశం ఉంది. ఎందుకంటే నెల నెలా పెన్షన్లు అందుకోవటంతో వారు తమ విశ్వసనీయతను చూపించాలని భావించటం సహజం. ముఖ్యంగా ఆ పెన్షన్లు ఎవరికైతే చాలా విలువైనవో వారు. పట్టణాలలో, నగరాలలో రెండు వేలు, మూడు వేలు అంటే లెక్కలేకపోవచ్చుగానీ, గ్రామాలలో రెండు వేల రూపాయలకు ఉండే పర్చేజింగ్ పవర్ ఎక్కువే. లబ్దిదారులలో ఆడవారైతేమాత్రం ఖచ్చితంగా టీడీపీకే ఓటు వేస్తారని ఢంకా బజాయించి చెప్పొచ్చు. ఎందుకంటే ప్రయోజనం పొందామనే లాయల్టీ వారికి ఎక్కువగా ఉంటుంది. బజారులో పప్పు, ఉప్పులాంటి ప్రతివస్తువూ కొనేటప్పుడు తాము పరోక్షంగా చెల్లించే పన్నులు, ప్రత్యక్షంగా చెల్లించే పన్నుల  సొమ్మునే ఈ సంక్షేమ పథకాల రూపంలో ఇస్తున్నారని, సొంత డబ్బేమీ పాలకులు ఇవ్వటంలేదని పేద, బడుగువర్గాల జనానికి అర్థంకావటానికి ఇంకా కొంత కాలం పడుతుంది కాబట్టి అప్పటిదాకా ఈ సంక్షేమ పథకాల ట్రెండ్ కొనసాగుతుంది.

 

లబ్దిదారులుకాకుండా మరో వర్గంకూడా టీడీపీకి అనుకూలంగా ఉంది. అదే విద్యావంతులు, తటస్థులైన అర్బన్ ఓటర్లు. ఎగువ మధ్యతరగతి, సంపన్న వర్గాలుకూడా దీనిలోకి వస్తాయి. వీరికి శాంతి భద్రతలు ముఖ్యం. చంద్రబాబు పాలన ‘చల్ తా హై’ అన్నట్లుగా ఎలాగోలా సాగుతోంది కదా, జగన్ ఫ్యాక్షన్ నేపథ్యం, కేసుల చరిత్ర దృష్ట్యా అతనికంటే చంద్రబాబే మెరుగేమో అన్నట్లుగా ఈ వర్గం ఆలోచన ఉంది. కాబట్టి వీరు టీడీపీకే మొగ్గు చూపుతారు. కాకపోతే ఇక్కడ టీడీపీకి ఒక మైనస్ కూడా ఉంది. ఈ వర్గం వారు ఓటింగుకు హాజరయ్యే శాతం సాధారణంగా తక్కువగా ఉంటుంది. ప్రభుత్వంలో, కాంట్రాక్టుల్లో తీవ్రమైన అవినీతి ఆరోపణలు, చంద్రబాబు అస్మదీయవర్గం చేసిన కాల్ మనీ వంటి కొన్ని అరాచకాలు, ప్రభుత్వ వ్యతిరేకతకూడా టీడీపీకి ఒక పెద్ద మైనస్ గా చెప్పుకోవాలి.

వైసీపీ

వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబం కన్వర్టెడ్ క్రిస్టియన్ కావటంవలన జగన్మోహన్ రెడ్డికి తండ్రి నుంచి సంక్రమించే ఆస్తులేమోగానీ గణనీయమైన క్రైస్తవ ఓట్లు వారసత్వంగా సంక్రమించాయి. సహజ వారసత్వంగా సంక్రమించిన రెడ్డి సామాజికవర్గం ఓట్లతోబాటు ఎస్సీ ఓట్లు వైసీపీకి మొదటినుంచి పెట్టని కోటగా ఉన్నాయి. ఎస్ సి ఓట్లు ఏపీలో సుమారు 12-13 శాతం ఉన్నాయి. బీసీలలో యాదవులుకూడా గణనీయమైన సంఖ్యలోనే వైసీపీవైపు ఉన్నారు. దీనికి కారణం ఆ కులంలోని ప్రముఖులైన పార్థసారధి(కృష్ణాజిల్లా), అనిల్ కుమార్ యాదవ్ వంటివారు వైసీపీవైపు ఉండటమే. ఇక ముస్లిమ్ లు కూడా వైసీపీ పట్ల బాగా అభిమానంగా ఉంటారు. ఎందుకంటే వారికి వైఎస్ రిజర్వేషన్ కల్పించారన్న ఒక కృతజ్ఞత వారిలో ఉంది. అయితే ఇటీవల జగన్ ఒక ఇంటర్వ్యూలో తాను కేంద్రంలో మోడికి మద్దతిస్తానని స్పష్టంగా చెప్పటంతో ముస్లిమ్ లలో విద్యావంతులు జగన్ ను అనుమానంగా చూస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బ్రాహ్మణులుకూడా మొదటినుంచి ఎక్కువగా వైసీపీవైపు ఉన్నారు.

ఇక ఈ వర్గాలన్నీ కాకుండా గ్రామీణ ఓటర్లలలో, రాష్ట్ర వ్యాప్తంగా పదేళ్ళుగా నడుస్తున్నాడు కాబట్టి జగన్ కు ‘ఒకసారి (అవకాశం ఇచ్చి) చూద్దాం’ అనే ఆలోచన అయితే ప్రబలంగానే ఉంది. అయితే ఒకవేళ జగన్ కు అవకాశమిస్తే… ఓదార్పుయాత్రలు, పాదయాత్రలకు స్పాన్సర్ చేసిన అతని అస్మదీయ వర్గం రేపు రాష్ట్రంమీదపడి అడ్డగోలుగా దోచుకుంటుందని, శాంతిభద్రతలు అల్లకల్లోలమవుతాయని వ్యక్తమవుతున్న సందేహాలు వైసీపీకి ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవాలి.

జనసేన

పవన్ కళ్యాణ్ తనను తాను కాపు వ్యక్తిగా చెప్పుకోవటానికి ఇష్టపడకపోయినా జనసేనకు ఎక్కువగా కాపుకాస్తున్నది  కాపు సామాజికవర్గమే. ఏపీలో అత్యధిక జనాభా ఉన్న సామాజికవర్గం కాపుకులం. వీరు జనాభాలో 22-25 శాతం ఉన్నారని అంటారు. కాపు, బలిజ, తెలగ, ఒంటరి, తూర్పుకాపు అనే వర్గాలు దీనిలోకి వస్తాయి. దాదాపు ఏపీలో 38 నియోజకవర్గాలలో ఫలితాలను ప్రభావితం చేసే స్థాయిలో కాపులు ఉన్నారంటారు. సంఖ్యాపరంగా గణనీయంగా ఉన్న కాపులకు, చిరంజీవి ప్రజారాజ్యం పెట్టిననాటినుంచి రాజ్యాధికారంపట్ల స్ఫృహ మొదలయింది. అయితే కమ్మ, రెడ్డి వర్గాల స్థాయిలో ఆర్థిక వనరులు లేకపోవటంతో వారి ప్రయత్నాలు ముందుకు సాగటంలేదు. దానికితోడు కులాన్ని సంఘటితంచేసే ఒక బలమైన నాయకత్వం రావటంలేదు. కాపుల పోలరైజేషన్ అత్యధిక స్థాయిలో ఒకే ఒక్కసారి జరిగింది. అది రంగా ఆధ్వర్యంలో 1988లో విజయవాడలో జరిగిన కాపునాడు సభ సమయంలో. 2008లో ఏర్పడిన ప్రజారాజ్యం పార్టీకి తొలినాళ్ళలో విపరీతమైన పోలరైజేషన్ జరిగినప్పటికీ, అది క్రమక్రమంగా పలచబడుతూ, 2009 ఎన్నికల సమయానికి చాలావరకు దిగజారిపోయింది… నాడు పార్టీలో కీలకపాత్ర పోషించిన అల్లు అరవింద్ వల్ల, టిక్కెట్లు అమ్ముకున్నాడని ప్రత్యర్థులు చేసిన దుష్ప్రచారం వల్ల. దీనితో కాపులుకూడా పూర్తిస్థాయిలో ప్రజారాజ్యానికి ఓట్లు వేయలేదు. విచిత్రమేమిటంటే జనసేనకు కూడా ఇప్పుడు అలాంటి పరిస్థితే ఏర్పడింది. జనసేనకు ఒక సమయంలో విపరీతమైన ఊపు వచ్చినప్పటికీ, పవన్ తెలుగుదేశందగ్గర పదివేల కోట్లు తీసుకుని లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నాడని ప్రత్యర్థులు ఎన్నికలముందు చేసిన దుష్ప్రచారం జనసేనను పలచన చేసింది. దీనితో కాపులలోనే 40-45 ఏళ్ళ పైబడిన వారు పవన్ పట్ల విముఖంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఏది ఏమైనా ముద్రగడను అవమానించి, కాపునేతలపై కేసులు పెట్టించిన టీడీపీకి వేయటానికికూడా సుముఖంగా లేరు. మరోవైపు, చిరంజీవి, పవన్ ను తీవ్రంగా అవమానించటంతోబాటు కాపులకు రిజర్వేషన్ల విషయంలో దోబూచులాట ఆడిన జగన్ కు ఓట్లు వేయటానికికూడా ఇష్టపడటంలేదంటున్నారు. కాబట్టి కాపుఓట్లు అధికశాతం జనసేనకే పడే అవకాశం ఉంది.

ఇక జనసేన వెనక బలంగా నిలబడే మరో వర్గం 18-25 సంవత్సరాల మధ్య ఉండే యువత. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కులాలు, మతాలలోనూ పవన్ కు ఈ వర్గంలో గణనీయమైన సంఖ్యలో మద్దతు ఉంది. పవన్ రేపు ఏమైనా గణనీయమైన స్థానాలు సంపాదించగలిగితే అది వీరివల్లే అని అర్థం చేసుకోవాలి. నిష్కళంకమైన పవన్ వ్యక్తిత్వం, అతని ఆదర్శాల వల్ల ప్రభావితమైన ఈ యువత జనసేన పట్ల చాలా ఆశావహంగా ఉన్నారు. పవన్ టీడీపీతో మిలాఖత్ అయ్యాడని ప్రత్యర్థులు చేస్తున్న దుష్ప్రచారాన్ని వాళ్ళు అసలు ఖాతరే చేయటంలేదు.

మరోవైపు మత్స్యకార సామాజికవర్గం, మాదిగలలో కూడా జనసేనకు గణనీయమైన మద్దతు ఉన్నట్లు చెబుతున్నారు. కాకినాడ ప్రాంతంలో మత్స్యకారులకు సంబంధించిన సమస్య విషయంలో పవన్ చొరవ తీసుకోవటంతో ఆ వర్గం జనసేనవైపు ఆకర్షితులైనట్లు తెలుస్తోంది.

ఇక కమ్యూనిస్టుల ఓట్లు, మాయావతితో పొత్తు పెట్టుకున్నందున దళితుల్లోని అతికొద్ది శాతం ఓట్లుకూడా జనసేనకు పడతాయని చెప్పొచ్చు.

మొత్తం మీద చూస్తే వివిధ సామాజివర్గాలు-గణాంకాల పరంగా జగన్ కు పైచేయి ఉన్నట్లు కనబడుతోంది. ముఖ్యంగా ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలలో వైసీపీ ప్రాబల్యం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. అయితే  సంక్షేమ పథకాల లబ్దిదారులు బలంగా విశ్వాసపాత్రత(లాయల్టీ)ను ప్రదర్శిస్తే, అర్బన్ జనాభా(విద్యావంతులు) ఓటింగు పెరిగితే మాత్రం వైసీపీకి కష్టమవుతుంది.

 

(శ్రవణ్ బాబు, సీనియర్ జర్నలిస్టు,ఫోన్ నెంబర్. 9948293346)