వైఎస్ జగన్ ప్రభుత్వం మీద పడిన మరకల్లో కోర్టులను లెక్కచేయడం లేదనేది ప్రధానమైన మరక. హైకోర్టు నుండి ఏ తీర్పు వచ్చినా దాన్ని పై కోర్టులో సవాల్ చేయడం, చివరికి హైకోర్టు తీర్పునే అనుసరించాలనే ఉత్తర్వులతో వెనుదిరగడం పరిపాటిగా మారిపోయాయి. సుమారు 70 వరకు కేసుల్లో వైఎస్ జగన్ ప్రభుత్వం న్యాయస్థానాల్లో తేలిపోయింది. ఒక్కోసారి హైకోర్టు నుండి కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలా అనే హెచ్చరికలు కూడ అందుకున్నారు. ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ కార్యదర్శి, డీజీపీ కూడ కోర్టుల ముందు హాజరుకావల్సి వచ్చింది. ప్రభుత్వం నుండి సరైన సమాధానం రాకపోతే కోర్టులు ఇలాగే వ్యవహరిస్తాయి మరి. ఇలా పదే పదే కోర్టుల ముందు ప్రభుత్వం చేష్టలుడిగి నిలబడటానకి కారణం లీగల్ టీమ్, సలహాదారుల బృందమేనని మొదట్లో అంతా అనుకున్నారు.
కానీ రంగులు తొలగించమని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఎప్పుడైతే తమకు తామే వక్రీకరించుకుని పార్టీ జెండా రంగులకు ఇంకో రంగు అందనంగా కలిపి వేయాలని జీవో పాస్ చేయగానే వైఎస్ జగన్ ముందు సలహాదారులు కేవలం అలంకరణప్రాయం మాత్రమేనని అర్థమైపోయింది. వైఎస్ జగన్ వద్ద దాదాపు 30 మంది వరకు సలహాదారులున్నారు. వారిలో విషయ పరిజ్ఞానం ఉన్నవారు మెండుగానే ఉన్నారు. వారికి ఏ కేసులో పై కోర్టులకు వెళితే ఏం జరుగుతుంది, తీర్పులు ఎలా వస్తాయి, పైచేయి సాధించాలంటే ఏం చేయాలి లాంటి విషయాలు తెలియవని అనుకోవడానికి లేదు. కానీ వారి సలహాలకు విలువంటూ ఉంటే కదా వారు ఇలా కాదు అలా చేస్తే బాగుంటుందని చెప్పడానికి.
మొన్నామధ్యన సలహాదారుగా ఉన్న రామచంద్రమూర్తి ఉన్నపళంగా పదవికి రాజీనామా చేశారు. ఆయన సన్నిహిత వర్గాల మాటల మేరకు సలహాదారుగా పెద్దగా పనేమీ లేకనే ఆయన రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. దీన్నిబట్టి సలహాదారుల సేవలను ప్రభుత్వం ఏ మేరకు వాడుకుంటుందో ఒక ఐడియా వచ్చేసింది. బయటకు మాత్రం ఎవరు మాట్లాడినా సలహాదారులు ఎందుకున్నట్టు, జీతాలు తీసుకుంటున్నప్పుడు ప్రభుత్వానికి ఉపయోగపడే సలహా ఒక్కటైనా ఇవ్వొచ్చు కదా అంటున్నారు. కానీ లోపల జరిగే అసలు సీన్ ఏమిటో ఎవ్వరూ గ్రహించరు. ఇలా లోపల పనిలేక, బయట విమర్శలు తప్పక సలహాదారుల టీమ్ ఇక దీన్ని భరించడం మా వల్ల అయ్యే పని కాదని సీఎం ముందు ఏకరువు పెట్టుకున్నట్టు ప్రత్యర్థి పార్టీలు అనుకుంటున్నాయి.