Mithun Reddy: లిక్కర్ స్కామ్‌లో మిథున్ రెడ్డి.. కోర్టు ఉత్తర్వులతో విచారణకు కొత్త మలుపు!

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పేరు కీలకంగా వినిపిస్తున్న వేళ, ఆయన హైకోర్టులో వేసిన పిటిషన్‌పై ఈరోజు కీలక తీర్పు వెలువడింది. రేపు ఉదయం సిట్ అధికారులు విచారణకు పిలవగా, దానికి ముందు మిథున్ కోర్టును ఆశ్రయించారు. తనను న్యాయవాదుల సమక్షంలోనే విచారించాలని కోరగా, హైకోర్టు దీనిపై సానుకూలంగా స్పందించింది.

విచారణ సమయంలో అధికారులు దురుసుగా వ్యవహరించే ప్రమాదం ఉందని కోర్టు దృష్టికి తీసుకురావడంతో, సిట్ కార్యాలయంలో న్యాయవాదులను అనుమతించాలని హైకోర్టు ఆదేశించింది. అయితే విచారణ ప్రక్రియకు న్యాయవాదులు అడ్డు పడకూడదని స్పష్టం చేసింది. ఇదే సమయంలో మిథున్ రెడ్డి పెట్టిన మరో విజ్ఞప్తి.. ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని కోర్టు ముందుకు తీసుకెళ్లిన విషయం తిరస్కరించబడింది.

కోర్టు స్పష్టంగా చెప్పింది.. విచారణ సీసీటీవీలో కనిపించేలా ఉండాలి కానీ, ప్రత్యేకంగా ఆడియో, వీడియో రికార్డింగ్ అనుమతించలేమని. దీంతో మిథున్ విచారణలో భాగంగా రేపు ఉదయం 10 గంటలకు విజయవాడలోని సిట్ కార్యాలయానికి హాజరుకావాల్సి ఉంది. ఇదిలా ఉండగా, సుప్రీంకోర్టు ఇప్పటికే మిథున్ రెడ్డికి అరెస్ట్ నుండి తాత్కాలిక రక్షణ కల్పించింది. తాము తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు అరెస్టు చేయరాదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కానీ విచారణకు సహకరించాల్సిందేనని నిబంధన విధించింది. ఈ పరిణామాల మధ్య మిథున్ రాజకీయ భవితవ్యం ఏ దిశగా మలుపు తిరుగుతుందో చూడాలి.

తెలంగాణ లో బ్లూ బుక్ || Ks Prasad Reacts On Telangana Politics || Revanth Reddy || KCR || TR