(ధ్యాన్)
ఇలియానాలో టెన్షన్ మొదలైందా? మొదలైందనే అంటున్నారు ఆమె సన్నిహితులు. ఎందుకంటే ఒకటి కాదు… రెండు కాదు… ఏకంగా ఆరేళ్ల తర్వాత ఆమె నటించిన తెలుగు సినిమా వచ్చే నెల విడుదల కానుంది. ఒకప్పుడు తెలుగులో ఓ వెలుగు వెలిగిన నాయిక ఇలియానా. రామ్ నటించిన`దేవదాసు`తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఇలియానా ఆ తర్వాత ఎన్ని హిట్ సినిమాలు చేసిందో అందరికీ తెలిసిందే. ఇల్లీబేబీ, గోవా పాలకోవాగా తెలుగు యువత నుంచి నీరాజనాలు అందుకున్న ఆమె సడన్గా బాలీవుడ్కి వెళ్లి అక్కడి నుంచి అటే పెళ్లి చేసుకుంది (ఇంకా ఇలియానా ఈ విషయాన్ని నిర్థరించలేదనుకోండి). అయితే తాజాగా ఆమె రవితేజ సరసన అమర్ అక్బర్ ఆంటోనీలో నటిస్తోంది. అంటే ఆరేళ్ల తర్వాత తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం న్యూయార్క్ లో జరుగుతోంది. వచ్చెనెల 5వ తేదీకి షూటింగ్ పూర్తవుతుంది. ఒకే ఒక్క పాట తప్ప. ఆ పాటను హైదరాబాద్లో చిత్రీకరిస్తారు. సెప్టెంబర్ 27న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది మైత్రీ మూవీస్ సంస్థ. సెప్టెంబర్లో సినిమా విడుదల అనే విషయం తెలిసినప్పటి నుంచీ ఇలియానాలో ఒక రకమైన టెన్షన్ మొదలైందట. ఆ విషయాన్నే ఆమె చూచాయగా చిత్ర యూనిట్తోనూ అన్నట్టు తెలుస్తోంది. `అమర్ అక్బర్ ఆంటోనీ`కి యలమంచిలి రవి, ఎర్నేని నవీన్, సీవీ మోహన్ నిర్మాతలు. శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్నారు.